కరాచి: పాకిస్థాన్ మాజీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ నసీర్ జెంషెడ్కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్కు శిక్ష పడింది. గత డిసెంబర్లో 33 ఏళ్ల జెంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది.
ఆక్లాండ్ వన్డేలో హాఫ్ సెంచరీ.. రాస్ టేలర్ సరికొత్త రికార్డు!
పాక్ సూపర్ లీగ్లో ప్లేయర్లు అయిన బ్రిటీష్ జాతీయులు యూసెఫ్ అన్వర్, మొహమ్మద్ ఇజాజ్ సరైన ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు జెంషెడ్ వారికి ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో పాటు మరికొందరు కూడా ఫిక్సింగ్లో భాగమయ్యారు. ఫిక్సింగ్లో భాగంగా అన్వర్, ఇజాజ్లు ప్లేయర్లకు ఆర్థిక సాయం చేసేవారు. గత డిసెంబర్ నెలలో నేషనల్ క్రైం ఏజెన్సీ ఫిక్సింగ్ను బట్టబయలు చేసింది.
పీఎస్ఎల్లో డాట్ బాల్స్ ఆడడం, సరైన ప్రదర్శన ఇవ్వకూండా ఆటగాళ్లు చేస్తే.. వారికి జెంషెడ్ ముడుపులు ఇచ్చాడని తేలింది. నేషనల్ క్రైం ఏజెన్సీ ముందు తమ నేరాలను జెంషెడ్, అన్వర్, ఇజాజ్ అంగీకరించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కోర్టు ఈ ముగ్గురికి శిక్షను విధించింది. జెంషెడ్కు 17 నెలల జైలు శిక్ష పడగా.. అన్వర్కు 40 నెలలు, ఇజాజ్కు 30 నెలల శిక్ష పడింది. 2018 ఆగస్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్పై పదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2016-17 సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నసీర్కు పీసీబీ పదేళ్ల నిషేధాన్ని విధించింది.
నసీర్ జంషెడ్ భార్య సమారా అఫ్జల్ స్పాట్ ఫిక్సింగ్ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'జంషెడ్ చర్యల కారణంగా మా కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. ఇతర క్రికెటర్లను అవినీతికి పాల్పడమని చెప్పడం సమంజసం కాదు. జంషెడ్ చాలా కష్టపడి ఉంటే అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతను షార్ట్ కట్ మార్గం ఎంచుకుని ప్రతిదీ కోల్పోయాడు. కెరీర్, హోదా, గౌరవం అన్ని నాశనం చేసుకున్నాడు. క్రికెటర్లందరూ జెంషెడ్ను ఓ ఉదాహరణగా తీసుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఆశిస్తున్నా' అని సమారా రాసుకొచ్చింది.