|
ఖాళీ దొరకడంతో స్వగ్రామమైన రాంచీకి
ఫుట్బాల్ కెరీర్లో గోల్ కీపర్గా ఆడుతూ ఉండే ధోనీ క్రికెట్లోనూ వికెట్ కీపర్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో మనకు తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20సిరీస్కు దూరమైన ధోనీ.. ఖాళీ సమయం దొరకడంతో తన స్వగ్రామమైన రాంచీకి చేరుకున్నాడు.
|
సరదాగా టెన్నిస్ ఆడుతూ
రాంచీలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సరదాగా టెన్నిస్ ఆడుతూ అతను కనిపించాడు. ఎప్పుడూ బ్యాట్తో కనిపించే ధోనీ.. రాకెట్తో కనిపించే సరికి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అతని ఆటను చూసేందుకు అక్కడే ఉన్న పలువురు తరలివచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు పంచుకుంటూ ఆన్లైన్ వేదికగా సందడి చేస్తున్నారు.
|
రిషబ్కు చోటిచ్చే విషయంలో జట్టు నుంచి ధోనీ
వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లకు ధోనీని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. రిషబ్కు చోటిచ్చే విషయంలో తానే జట్టు నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. భావి కీపర్గా పంత్ రాణిస్తాడనే నమ్మకంతో ధోనీ అతనికి పలు సూచనలు సైతం అందించాడు. విండీస్తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 3-0తో దక్కించుకోగా.. తాజాగా ఆసీస్తో సిరీస్ను 1-1తో సమం చేసింది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6నుంచి ఆసీస్తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
|
మహేంద్రుడి టెన్నిస్ టైమ్
‘మహేంద్రుడి టెన్నిస్ టైమ్'.., ‘ధోనికి ఇతర ఆటలపై కూడా ఎంతో ప్రేమ ఉంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న 3 వన్డే సిరీస్లకు ధోనీ హాజరుకానున్నాడు. ఈ అంతర్జాతీయ వన్డేలు భారత ప్రపంచ కప్కు పూర్తి సన్నాహక మ్యాచ్లుగా ఉపయోగపడనున్నాయి.