హైదరాబాద్: సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ధోనీ.. ఆర్మీ దుస్తుల్లో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇలా అందుకోవడంతో ధోనీ సంతోషం పది రెట్లు పెరిగిందని తెలిపాడు.
ఈ సందర్భంగా చేసిన పోస్టులో ధోనీ.. 'భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి.. దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా.. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్' అని పేర్కొన్నాడు.
రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ దుస్తుల్లో వచ్చి కవాతు చేస్తూ మరి అవార్డు స్వీకరించాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. అయితే కెప్టెన్గా ధోని సరిగ్గా ప్రపంచకప్ అందించిన రోజే ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా రాష్ట్రపతి కోవింద్, నరేంద్ర మోడీ, భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ధోనీ అభిమానులతో పంచుకున్నాడు. వీటికి బదులుగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'మీరు మాకెప్పుడు ఆదర్శమేనంటూ'.. కామెంట్ చేస్తున్నారు. ఆర్మీ డ్రెస్లో ఉన్న ధోని కూతురు జీవాకు ఆర్మీ క్యాప్ పెట్టి ఉన్న ఫొటోను ఈ పోస్ట్కు ట్యాగ్ చేశాడు. ఈ ఫొటో సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ధోనీ త్వరలో చెన్నై సూపర్కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడనున్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరగనుంది.