
హైదరాబాద్: భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు శనివారం రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. రిటైర్మెంట్ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రముఖులు,సెలబ్రిటీలు అంతర్జాతీయ క్రికెట్కి మహీ చేసిన సేవలపై అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో తాజగా ధోనీ రిటైర్మెంట్పై భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా స్పందించారు.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై సానియా మీర్జా స్పందించి.. మహీ ఆడిన తరంలోనే అథ్లెట్ అయినందుకు గర్విస్తున్నానన్నారు. 'ఎంఎస్ ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. నీ భవిష్యత్ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా' అని సానియా మీర్జా ట్వీట్ చేశారు.
తన ఫినిషింగ్ మ్యాజిక్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఎంఎస్ ధోనీకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతున్నది. టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ దిగ్గజంగా అభివర్ణించాడు. భారత ఆల్టైం ఎలెవన్ ఎంచుకోవాల్సి వస్తే హర్యానా హరికేన్ కపిల్ దేవ్ కంటే.. ధోనీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయని గవాస్కర్ అన్నాడు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లే అని.. తమ జట్లకు విజయం అందించడం తప్ప మరోదాన్ని తట్టుకోలేని వ్యక్తిత్వాలని సన్నీ పేర్కొన్నాడు.
అనూహ్య నిర్ణయంతో యావత్ క్రీడాలోకాన్ని షాక్కు గురిచేసిన ఎంఎస్ ధోనీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభాకాంక్షలు తెలిపింది. ఒక తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ధోనీ ఆటను మిస్ అవుతున్నామని ఐసీసీ సీఈవో మను సాహ్నీ ఆదివారం పేర్కొన్నారు. 'ఎంఎస్ ధోనీ ఆల్టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ధోనీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్లో అతడు కొట్టిన విన్నింగ్ షాట్ ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసులో ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది. అతడు మొత్తం తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడి ఆటను మిస్సవుతాం. ఈ సందర్భంలో అతడికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా' అని సాహ్నీ అన్నారు.
ఎంఎస్ ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో చివరి మ్యాచ్ ఆడాడు. అప్పుడు భారత్ గెలిచేలా అనిపించినా.. చివరి క్షణాల్లో అతడు రనౌటవ్వగా ఓటమిపాలైంది. దీంతో మాజీ సారథి అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. మొదట్లో రెండు నెలలే అంటూ విశ్రాంతి తీసుకున్నా.. తర్వాత దాన్ని పొడిగిస్తూ వచ్చాడు. ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. ఆపై ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు.