'ఆ క్షణమే ధోనిని కెప్టెన్గా చేయాలని నిర్ణయించుకున్నా'
హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి బుధవారం మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. తన కెరీర్లో మొత్తం 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్గా వ్యవహారించిన ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు భారత్ తరుపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్గా ధోని ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
దీంతో పాటు ప్రతి ఫార్మెట్లో కూడా 50కుపైగా మ్యాచ్లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్గా కూడా గుర్తింపు పొందాడు. సెప్టెంబర్ 2007న దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ టీ20లో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన ధోని సుమారు పదేళ్ల పాటు కెప్టెన్గా సేవలందించాడు.
కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న తరుణంలో ధోని నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు స్వాగతించారు. తాజాగా ధోనిని కెప్టెన్గా ఎంపిక చేసే ముందు తనకు ఎదురైన అనుభవాలను టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో పంచుకున్నాడు.

జట్టు భవిష్యత్తు కోసమే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
భారత జట్టు భవిష్యత్తు కోసమే ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని చెప్పిన వెంగ్ సర్కార్ గతంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ ఆసక్తికరమైన ఘటనను వివరించాడు. 2007లో జరిగిన వరల్డ్ టీ20కి ధోనిని కెప్టెన్గా ఎంపిక చేయాలని నిర్ణయించామని అన్నాడు.

ధోనితో అనుభవాలపై వెంగ్ సర్కార్
'బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా ఉన్న నేను ఆ బాధ్యతను తీసుకున్నాను. అయితే అతను గురించి వ్యక్తిగతంగా నాకు ఏమీ తెలియదు. ఆ క్రమంలోనే ధోనితో మాట్లాడాలని అనుకున్నా. దానిలో భాగంగా కోల్కతా నుంచి ముంబైకి ధోని ఆడే మ్యాచ్ చూడాలని నిర్ణయించుకున్నా. అయితే ప్రయాణపరంగా కూడా ధోనితో కలిసే వెళ్లాలనుకున్నా. ఆ మేరకు నా ఫ్లైట్ జర్నీని మార్చుకున్నా. ధోనితో కలిసి బిజినెస్ క్లాస్లో పయనించా. దాదాపు రెండు గంటలు పాటు ధోనితో కలిసి ప్రయాణించా' అని అన్నాడు.

ఇదే సరైన సమయం
అంతేకాదు 'ధోని గురించే తెలుసుకునేందుకు ఇదే సరైన సమయం అని భావించా. కానీ ధోనితో మాట్లాడే అవకాశం రాలేదు. విమానం టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే ధోని కునికిపాట్లు తీశాడు. ముంబై వచ్చిన తరువాత కానీ లేవలేదు. అప్పుడే ధోని వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నా. ఆ క్షణమే ధోనిని కెప్టెన్ గా చేయాలని నిర్ణయించుకున్నా' అని ధోనితో తన అనుభవాన్ని వెంగ్ సర్కార్ పేర్కొన్నాడు.

అణుకువ, పెద్ద వాళ్లను గౌరవించే తత్వం
ఆ క్షణంలో ధోనిలో చూసిన అణుకువ, పెద్ద వాళ్లను గౌరవించే తత్వం తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాడు. ఆ క్రమంలోనే ధోనికి నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని నిశ్చయించినట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని జట్టులోని మిగతా ఆటగాళ్లకు తెలియజేశానని అన్నాడు.

మైదానంలో ధోని వ్యవహరించే తీరు ఆకట్టుకుంది
'అప్పటి వరకు టీ20 క్రికెట్ని మనం ఆడలేదు. జట్టులోకి ఉత్సాహాన్ని నింపే కుర్రాళ్లు కావాలని భావించా. రాష్ట్ర స్థాయి జట్టులో కూడా ధోని కెప్టెన్గా వ్యవహరించలేదు. అయితే ఆటలో భాగంగా మైదానంలో ధోని వ్యవహరించే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి' అని తెలిపాడు.

ధోనియే సరైన నాయకుడని భావించా!
అప్పటికే జట్టులో చాలా మంది సీనియర్లు ఉన్నా, ధోనినే సరైన నాయకుడిగా భావించి అతన్ని ఎంపిక చేసినట్లు వెంగీ తెలిపాడు. 2014లో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ ధోని తీసుకున్న నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించాడు. టెస్టు క్రికెటర్గా ధోని ఇంకొంత కాలం ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications