జట్టు భవిష్యత్తు కోసమే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
భారత జట్టు భవిష్యత్తు కోసమే ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని చెప్పిన వెంగ్ సర్కార్ గతంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ ఆసక్తికరమైన ఘటనను వివరించాడు. 2007లో జరిగిన వరల్డ్ టీ20కి ధోనిని కెప్టెన్గా ఎంపిక చేయాలని నిర్ణయించామని అన్నాడు.
ధోనితో అనుభవాలపై వెంగ్ సర్కార్
'బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా ఉన్న నేను ఆ బాధ్యతను తీసుకున్నాను. అయితే అతను గురించి వ్యక్తిగతంగా నాకు ఏమీ తెలియదు. ఆ క్రమంలోనే ధోనితో మాట్లాడాలని అనుకున్నా. దానిలో భాగంగా కోల్కతా నుంచి ముంబైకి ధోని ఆడే మ్యాచ్ చూడాలని నిర్ణయించుకున్నా. అయితే ప్రయాణపరంగా కూడా ధోనితో కలిసే వెళ్లాలనుకున్నా. ఆ మేరకు నా ఫ్లైట్ జర్నీని మార్చుకున్నా. ధోనితో కలిసి బిజినెస్ క్లాస్లో పయనించా. దాదాపు రెండు గంటలు పాటు ధోనితో కలిసి ప్రయాణించా' అని అన్నాడు.
ఇదే సరైన సమయం
అంతేకాదు 'ధోని గురించే తెలుసుకునేందుకు ఇదే సరైన సమయం అని భావించా. కానీ ధోనితో మాట్లాడే అవకాశం రాలేదు. విమానం టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే ధోని కునికిపాట్లు తీశాడు. ముంబై వచ్చిన తరువాత కానీ లేవలేదు. అప్పుడే ధోని వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నా. ఆ క్షణమే ధోనిని కెప్టెన్ గా చేయాలని నిర్ణయించుకున్నా' అని ధోనితో తన అనుభవాన్ని వెంగ్ సర్కార్ పేర్కొన్నాడు.
అణుకువ, పెద్ద వాళ్లను గౌరవించే తత్వం
ఆ క్షణంలో ధోనిలో చూసిన అణుకువ, పెద్ద వాళ్లను గౌరవించే తత్వం తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాడు. ఆ క్రమంలోనే ధోనికి నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని నిశ్చయించినట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని జట్టులోని మిగతా ఆటగాళ్లకు తెలియజేశానని అన్నాడు.
మైదానంలో ధోని వ్యవహరించే తీరు ఆకట్టుకుంది
'అప్పటి వరకు టీ20 క్రికెట్ని మనం ఆడలేదు. జట్టులోకి ఉత్సాహాన్ని నింపే కుర్రాళ్లు కావాలని భావించా. రాష్ట్ర స్థాయి జట్టులో కూడా ధోని కెప్టెన్గా వ్యవహరించలేదు. అయితే ఆటలో భాగంగా మైదానంలో ధోని వ్యవహరించే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి' అని తెలిపాడు.
ధోనియే సరైన నాయకుడని భావించా!
అప్పటికే జట్టులో చాలా మంది సీనియర్లు ఉన్నా, ధోనినే సరైన నాయకుడిగా భావించి అతన్ని ఎంపిక చేసినట్లు వెంగీ తెలిపాడు. 2014లో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ ధోని తీసుకున్న నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించాడు. టెస్టు క్రికెటర్గా ధోని ఇంకొంత కాలం ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.