హైదరాబాద్: టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తెలంగాణలో క్రికెట్ అకాడమీ ప్రారంభించబోతున్నారు. అతి త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్ అకాడమీ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. 'ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ' పేరుతో అకాడమీని నిర్మించనున్నారు. ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ.. బ్రెయినియాక్స్ బీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రెండేళ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.
భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ అకాడమీ ఒప్పందానికి సంబందించిన వివరాలు వెల్లడించారు. 'ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ' తనతో పాటు ధోనీ మానసపుత్రిక అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిహిర్ దివాకర్.. మహీకి సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.
రాబోయే రెండేళ్లలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మిహిర్ దివాకర్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్లో బళ్లారిలో మొదలుకానుందని చెప్పారు. మిహిర్ దివాకర్ ఈ విషయం చెప్పడంతో తెలంగాణ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న పేద ఆటగాళ్లు మహీ అకాడమీ ద్వారా సత్తాచాటే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ కోచింగ్ డైరెక్టర్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారెల్ కలినన్ కొనసాగుతున్నారు. భారత్లో ఇప్పటికే 50కి పైగా ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో కూడా మూడింటిని ప్రారంభించారు. 'మేము కెరీర్ ఆరంభించిన రోజుల్లో మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అందుకే ఆసక్తిగల క్రికెటర్లకు అండగా ఉంటూ వారికి స్కాలర్షిప్లను కూడా అందిస్తాం. ఆరు సంవత్సరాల క్రితం అకాడమీలను ప్రారంభించాం. మా విద్యార్థులలో 20 మంది వివిధ రాష్ట్రాల తరఫున ఆడుతున్నారు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడతారు' అని దివాకర్ ధీమా వ్యక్తం చేశారు. ధోనీ ఎడ్యూకేషన్ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే జూన్ నుంచి బెంగళూరులో ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్ కూడా ప్రారంభించనున్నారు.
IPLAuction2021: వేలంలో అతి చిన్న, పెద్ద ఆటగాళ్లు ఎవరో తెలుసా?