ముంబై: సీనియర్ బౌలర్లు రిటైరైనా టీమిండియా ఏమాత్రం ఇబ్బందిపడదని భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంటున్నాడు. సీనియర్ బౌలర్లు రిటైరైతే.. బాధ్యతలు స్వీకరించడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. ప్రస్తుతం రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉందని షమీ తెలిపాడు. ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో జూనియర్ బౌలర్ల ప్రదర్శనే నిదర్శనమని తెలిపాడు. మణికట్టు గాయం కారణంగా అడిలైడ్ టెస్ట్ తర్వాత ఆసీస్ పర్యటన నుంచి షమీ తప్పుకున్నాడు.
వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా మహ్మద్ షమీ మాట్లాడుతూ...'మేం (సీనియర్ బౌలర్లు) రిటైరయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించేందుకు యువ బౌలర్లు సిద్ధంగా ఉంటారు. ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా రాటుదేలుతారు. మేము ఆటకు దూరమైనప్పుడు సంధి దశ సాఫీగా సాగుతుందని భావిస్తున్నా. పేరున్న ఆటగాడు రిటైరైనా జట్టు ఇబ్బంది పడబోదు. ఇప్పుడు రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉంది' అని అన్నాడు.
'ఆటలో అనుభవం ఎల్లప్పుడూ అవసరమే. త్వరలోనే యువ ఆటగాళ్లు అనుభవం సంపాదిస్తారు. బయో బబుల్ వాతావరణం నేపథ్యంలో నెట్ బౌలర్లుగా తీసుకెళ్లడం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టులోకి వచ్చాక వారు భయం లేకుండా బౌలింగ్ చేయగలుగుతారు. కొందరు ఆటగాళ్లను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఐపీఎల్ కూడా మనకు ఎంతో అనుభవాన్ని ఇస్తోంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం చాలా పెద్ద విషయం. మేము రెండుసార్లు చేశాం. అదికూడా సీనియర్లు లేకున్నా. మేము యువకులపై కూడా నమ్మకంగా ఉండగలం అని అనడానికి ఇదే ఓ ఉదాహరణ' అని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. గాయం కారణంగా షమీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో ఆడని విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్యాదవ్, రవీంద్ర జడేజాల గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్లు సత్తాచాటిన సంగతి తెలిసిందే. నిర్ణయాత్మక గబ్బా టెస్టులో సీనియర్లు ఎవరూ లేకున్నా.. యువ బౌలర్లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. టీమిండియాకు అద్భుత సిరీస్ విజయాన్ని అందించారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం అవనుంది. కింగ్స్ పంజాబ్ తరఫున షమీ ఆడుతున్న విషయం తెలిసిందే.
IPL 2021: వచ్చే ఏడాది వేలంలో.. లియోనల్ మెస్సీని తప్పకుండా తీసుకుంటాం: సంగక్కర