హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియాపై మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కొనియాడాడు. కుల్దీప్, చాహల్లను ఎలా ఎదుర్కోవాలో తెలియనంత వరకు కివీస్ విజయం సాధించడం కష్టమని పేర్కొన్నాడు.
తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో అజహరుద్దీన్ మాట్లాడుతూ "భారత్కు అద్భుతమైన జట్టు ఉంది. గత నాలుగు లేదా ఐదేళ్లుగా సూపర్ ఫామ్ను ప్రదర్శిస్తోంది. కేవలం వన్డేల్లోనే కాదు మూడు ఫార్మాట్లలో అద్భుతమైన జట్టుని టీమిండియా సొంతం. ఇతర జట్ల ప్రమాణాలు కాస్త తగ్గాయి గానీ భారత్ మాత్రం నానాటికీ బలపడుతోంది" అని అన్నాడు.
"మనతో పోటీ పడేదెవరైనా సరే ఫలితాలు మాత్రం ఒకేలా ఉంటాయి. విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరం. చాన్నాళ్ల నుంచి సుదీర్ఘంగా ఆడుతున్నాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అందులోనూ చురుకైన ఫీల్డర్. అందుకే అతడు విశ్రాంతి తీసుకుంటే మంచిదే" అని అజహరుద్దీన్ చెప్పుకొచ్చాడు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇప్పటికే నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్ని 157 పరుగులకే కుప్పకూల్చి 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా.. మౌంట్ మాంగనుయ్లో జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.
మరోవైపు ఈ సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా సెలక్టర్లు మిగిలిన రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.