హైదరాబాద్: ఐపీఎల్కు ఇది సరైన సమయం కాదని భారత టెస్ట్ కెప్టెన్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. మహిళల క్రికెట్లో ఇంకా బలమైన ఆటతీరు కనపడనప్పుడే మహిళల ఐపీఎల్కు అర్థముంటుందని తెలిపింది. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఆడేందుకు తగినంత సంఖ్యలో నాణ్యమైన క్రీడాకారులు ఉండడం అవసరమని వివరించింది. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఇలా మాట్లాడింది.
'భారత మహిళల-ఏ జట్టుకే ఇంకా నాణ్యమైన క్రీడాకారులు కావాలి. అలాంటి వాళ్లు ఉన్నప్పుడే మహిళల ఐపీఎల్ను నిర్వహించాలి. అప్పుడే దానికి అర్థముంటుంది'' అని ఆమె చెప్పింది. బీసీసీఐ వచ్చే ఐపీఎల్లో మహిళలకు ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించనుంది. ఇది మహిళల ఐపీఎల్కు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. ''అంతర్జాతీయ ప్లేయర్కు, దేశవాళీ ప్లేయర్కు మధ్య చాలా తేడా ఉంటుంది' అని వివరించింది.
'ఇప్పుడే ఐపీఎల్ను నిర్వహిస్తే మహిళల క్రికెట్ వ్యాప్తికే అది ప్రతికూలంగా మారొచ్చు. పటిష్టమైన దేశవాళీ వ్యవస్థ, చాలా మంది నాణ్యమైన క్రీడాకారిణులు ఉన్నప్పుడే ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం' అని మిథాలీ విలేకర్లతో చెప్పింది.
ఆమెతో వెటరన్ పేస్ బౌలర్ జులన్ గోస్వామి కూడా అంగీకరించింది. ''ఆమె చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తా. దేశవాళీ వ్యవస్థ ఇంకా బలపడాలి'' అని అంది. భారత మహిళల జట్టుకు రిజర్వ్బెంచ్ బలంగా లేదని మిథాలీరాజ్ ఒప్పుకుంది. తర్వాతి తరం అంతర్జాతీయ క్రికెటర్లు తయారు కావడానికి కనీసం మరో రెండేళ్ల సమయం పడుతుందని చెప్పింది.
ఓటమికి గురైన భారత మహిళల జట్టు:
ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో వన్డే సిరీస్లో భారత్ 0-3తో పరాజయం పాలైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఓటమి కన్నా.. బాగా ఆడనివాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు అవసరమైన నాణ్యమైన క్రీడాకారిణులు లేకపోవడమే భారత్కు ఆందోళన కలిగిస్తోంది.
''ఇప్పుడిప్పుడే భారత-ఏ పర్యటనలు, ఏ జట్టు కూర్పుపై దృష్టి సారించాం. ద్వితీయ శ్రేణి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిని అందుకోవడానికి కనీసం ఓ రెండేళ్ల సమయం పడుతుంది'' అని మిథాలీ చెప్పింది. వన్డే సిరీస్లో తమను ఓడించిన ఆస్ట్రేలియా తమకంటే చాలా చాలా బలమైన జట్టు అని ఆమె తెలిపింది. బీసీసీఐ కాంట్రాక్టులు ఇచ్చిన నేపథ్యంలో మహిళా క్రికెటర్లు మరింత కష్టపడాలని అభిప్రాయపడింది.