న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చాలా మిస్సవుతున్నా అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. ధోనీ టీమిండియా తరఫున మళ్లీ ఆడాలని ఆకాంక్షించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి మహీ క్రికెట్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్, రీ ఎంట్రీపై ఎందరు స్పందిస్తున్నా.. తాను మాత్రం ఇప్పటివరకు ఏ విషయం చెప్పలేదు. ధోనీ హయాంలోనే మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ అరంగేట్రం చేశారు.
అజర్ అలీ బ్యాట్ను కొనుగోలు చేసిన పుణె క్రికెట్ మ్యూజియం!!
తాజాగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'ధోనీని చాలా మిస్సవుతున్నా. సీనియర్ ఆటగాడితో ఆడుతున్నప్పుడు క్రమంగా అతడిని ఇష్టపడటం మొదలైతే.. కొంతకాలానికి వారి ఉనికిని మిస్సయ్యినట్లు ఫీలవుతాం. రిటైర్మెంట్పై నిర్ణయం ధోనీకి వదిలేయాలి. దీనిపై మనం చర్చించడంలో అర్థం లేదు. ధోనీ ఇప్పటికీ చాలా ఫిట్గా ఉన్నాడు. మహీ భారతదేశం తరపున ఆడాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక ఫ్యాన్గా ధోనీ ఆడితే ఎంతో సంతోషిస్తాను. ధోనీ బరిలోకి దిగితే భారత్కు ఎంతో మంచిది' అని కుల్దీప్ అన్నాడు.
శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్లో తాను ఎంఎస్ ధోనీ ఆగ్రహానికి గురయ్యానని, అప్పుడు తనకు చాలా భయమేసిందని కుల్దీప్ ఇటీవలే చెప్పాడు. 'మూడేళ్ల క్రితం ఇండోర్లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో కుశాల్ పెరీరా బ్యాటింగ్ చేస్తుండగా నేను బౌలింగ్ చేశాను. అప్పటికే నా బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టి పెరీరా జోరుమీదున్నాడు. అప్పుడు ధోనీ ఏదో చెప్పాడు. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. తర్వాతి బంతికి పెరీరా రివర్స్ స్వీప్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లింది. దాంతో పట్టరాని కోపంతో మహీ భాయ్ నా దగ్గరకు వచ్చి గట్టిగా అరిచాడు. నేనేమైనా పిచ్చోడినా?, 300 వన్డేలు ఆడాను. ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం చేస్తున్నా. నువ్వు నా మాట వినడం లేదు అని నాతో అన్నాడు. దాంతో ఒక్కసారిగా భయపడిపోయా' అని చైనామన్ బౌలర్ ఆనాటి పరిస్థితిని వివరించాడు.
కుల్దీప్ కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కివీస్ పర్యటనలో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 'టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అరంగేట్రం నుంచి నాకు అండగా ఉన్నాడు. అన్ని విషయాల్లో సహకరించాడు. పరిస్థితులను బట్టి జట్టు యాజమాన్యం ఎవరిని ఆడించాలనే విషయాన్ని నిర్ణయిస్తుంది' అని పేర్కొన్నాడు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.