హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకోమని అడగటం కొత్తేమీ కాదు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ ట్విట్టర్ వేదికగా తనను పెళ్లి చేసుకోమని అడిగింది. ఇప్పటివరకు కోహ్లీకి వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ అన్నీ అమ్మాయిలు చేసినవే కావడం గమనార్హం.
అయితే తాజాగా పాకిస్థాన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో' అని కోరుతూ ప్లకార్డు పట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల జరిగిన వరల్డ్ ఎలెవెన్-పాకిస్థాన్ మూడు టీ20ల సిరిస్కు బందోబస్తుగా వచ్చిన ఓ కానిస్టేబుల్ ఈ ప్లకార్డు పట్టుకుని ఫొటోకి ఫోజిచ్చాడు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొహ్లీని పాకిస్థాన్ కానిస్టేబుల్ పెళ్లి చేసుకో అని కోరుతున్నాడంటూ నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. అయితే ఈ ఫోటో వెనుకున్న అసలు విషయం మాత్రం వేరేలా ఉంది. అది మ్యాచ్ చూడటానికి వచ్చిన అమ్మాయిలు పడేసి వెళ్లిన ప్లకార్డు అని తెలిసింది.
ఎవరో ఆకతాయి 'ఒక్కసారి చూపించండి, ఫొటో తీసుకుంటా' అనగానే ఆ పోలీసు అలా ఫోజిచ్చాడంట.