
హైదరాబాద్: విస్డెన్ ఇండియా ప్రకటించిన 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సొంతం చేసుకున్నాడు. గతేడాది కాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తోన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. తన ఆరో ఎడిషన్ కవర్ పేజిపై విస్డెన్ ఇండియా భారత మహిళా జట్టు ఫోటోని ప్రచురించింది.
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత మహిళా జట్టు పైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమిపాలు కావడంతో రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది మోస్ట్ సక్సెస్పుల్ భారత, అంతర్జాతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఈ ఏడాది చివర్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పర్యటనలు కోహ్లీకి ఛాలెంజ్గా నిలుస్తాయని తెలిపింది. విస్డెన్ ఇండియా ఎడిటర్స్ నోట్లో సురేశ్ మీనన్ 'కోహ్లీ ఇప్పటికే అరుదైన ఘనత సాధించాడు. విదేశాల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే, అప్పుడు అతడు చరిత్ర సృష్టిస్తాడు' అని రాసుకొచ్చారు.
భారత మహిళా క్రికెట్ దిశను మార్చిన మిథాలీసేనపై విస్డెన్ ఇండియా ప్రశంసల వర్షం కురిపించింది. గతేడాది భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు చేరడంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున ప్రస్తావించింది. భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'గా నిలిచింది.
2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఎర్రాపల్లి ప్రసన్నతో పాటు విస్డెన్ ఇండియా హాల్ ఆఫ్ పేమ్లో చోటు దక్కించుకున్న మొదటి మహిళా క్రికెటర్గా శాంతనా రంగస్వామి నిలిచారు. శాంతనా రంగస్వామి భారత మహిళ క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్గా వ్యవహారించారు.