
హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో మూడు వన్డేల సిరిస్ను 2-1తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమికి కారణం కోహ్లీ ఎంపిక చేసిన తుది జట్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మూడో వన్డేలో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ స్థానంలో దినేశ్ కార్తీక్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... మరోవైపు సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చారు.
సిరిస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను తప్పిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ ఓటమికి కోహ్లీ నిర్ణయమే కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సిరిస్లో భాగంగా జరిగిన గత రెండు వన్డేల్లో మిడిలార్డర్ బ్యాట్స్మన్ దారుణంగా విఫలమైంది. దీంతో కోహ్లీ తుది జట్టులో స్వల్ప మార్పులు చేశాడు. అయితే, కేఎల్ రాహుల్కు బదులు దినేశ్ కార్తీక్ని తుది జట్టులో ఎంపిక చేయడం కోహ్లీ చేసిన తప్పుగా అభివర్ణిస్తున్నారు.
తొలి టీ20లో సెంచరీతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ను పక్కన బెట్టడం వల్లే మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైందని అంటున్నారు. రోహిత్కు ఏమో చాలా అవకాశాలు ఇస్తారని, రాహుల్కు మాత్రం అవకాశలివ్వకుండా జట్టులో నుంచి తీసేయడం ఎంతవరకు సబబని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
అయితే, మూడో వన్డే నుంచి కేఎల్ రాహుల్ని తప్పించడంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు. "వ్యూహాత్మక మార్పులో భాగంగానే దినేశ్ కార్తీక్కు అవకాశం ఇచ్చాం. మాకు మిడిల్ ఓవర్స్ను సమర్దవంతంగా ఎదుర్కునే బ్యాట్స్మన్ కావాలి. ఆ స్థానంలో కార్తీక్ గతంలో రాణించాడు. అందుకే అతనికి అవకాశం ఇచ్చాం" అని అన్నాడు.