|
హాంకాంగ్తో మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ అరంగేట్రం
టీమిండియాలో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్ లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ ఖలీల్ అహ్మద్ వైపు కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మొగ్గు చూపడం విశేషం. వన్డే జట్టులో లెప్ట్ ఆర్మ్ పేసర్ ఉండే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్లో రాణిస్తే మరింత ముందుకు
యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఆసియా కప్ టోర్నమెంట్లో ఖలీల్ అహ్మద్ గనుక రాణిస్తే వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కడం ఖాయం. 'తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై మేం దృష్టి పెట్టాల్సి ఉంటుంది' అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంతో యువ ఆటగాళ్లు సైతం దృష్టి సారించారు.
రాహుల్ ద్రవిడ్ స్కూల్ నుంచి వచ్చిన ఖలీల్ అహ్మద్
ఇక్కడ ఖలీల్ అహ్మద్ కలిసొచ్చే అంశం ఏంటంటే అతడు రాహుల్ ద్రవిడ్ స్కూల్ నుంచి రావడమే. అంతేకాదు ఖలీల్ అహ్మద్ ఆసియా కప్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో జహీర్ ఖాన్ తనకు ఆదర్శమని, అండర్ -19 కోచ్ రాహుల్ ద్రవిడ్ తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచారని చెప్పిన సంగతి తెలిసిందే.
నాకు స్పూర్తి జహీర్ ఖాన్
"2016లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడటం నాకు ఎంతో లాభించింది. నా స్పూర్తి జహీర్ ఖాన్. అతడిలా గొప్ప బౌలర్ కావాలని కలలు కన్నాను. ఈ దిగ్గజ ఆటగాడు చెప్పిన ప్రతీ సలహా, సూచన డైరీలో నోట్ చేసుకున్నా. నాకు ఏ సందేహం వచ్చినా ధైర్యంగా అడిగేవాడిని. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్లో కూడా ఎలా ఆడాలో అతడి సూచనలు డైరీలో నోట్ చేసుకుంటాను. అందరూ నన్ను మరో జహీర్ అంటున్నారు. జహీర్ లెజెండ్ క్రికెటర్. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒకరు స్థానాన్ని నేను భర్తీ చేయడమేంటి? తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాను. జహీర్ ఖాన్ కంటే ఎక్కువ వికెట్లు తీస్తాను(నవ్వుకుంటూ)" అని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు.
ద్రవిడ్ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతా
"గెలుపోటముల గురించి ఆలోచించకు, నీ ఆట నువ్వు ఆడు" అంటూ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఖలీల్ అహ్మద్ అన్నాడు. ద్రవిడ్ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతామని, ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడని వివరించాడు. వందశాతం కష్టపడతానని, భారత్ తరుపున్న ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు. కాగా, విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు.