ధోనీ ఆల్టైం అత్యుత్తమ కెప్టెన్:
క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కెవిన్ పీటర్సన్ కితాబిచ్చాడు. ఈ విషయంపై చర్చ జరిగినా.. ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎవరికైనా చాలా కష్టమని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ తేల్చిచెప్పాడు. కెవిన్ పీటర్సన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ... 'టీమ్ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు సారథ్యం వహించి ధోనీ ఎన్ని ఘనతలు సాధించాడో తెలుసు. అతడి జీవన విధానం తెలుసు. అందరికీ అతడిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా తెలుసు. అందుకే ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా వాదించడం చాలాకష్టం' అని పేర్కొన్నాడు.
టీ20 ,వన్డే ప్రపంచకప్:
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2011లో వన్డే ప్రపంచకప్ను సైతం కైవసం చేసుకుంది. ఇక 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. మహీ నాయకత్వంలో భారత్ మొదటిసారి టెస్ట్ క్రికెట్లో నంబర్ 1 జట్టుగా నిలిచింది. 60 టెస్టుల్లో 27 విజయాలతో రెండవ అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్గా నిలిచాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ ధోనీని అధిగమించాడు.
చెన్నైకి మూడు టైటిల్స్:
ఐపీఎల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహిస్తున్న ఎంఎస్ ధోనీ.. 2010, 2011 మరియు 2018 సంవత్సరాలలో జట్టుకు టైటిల్ను అందించాడు. గతేడాది కూడా తృటిలో కప్ మిస్ అయింది. ముంబై చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. ఇక గతేడాది 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాతి నుంచి ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-13తో మళ్లీ బరిలోకి దిగుదామనుకున్నా.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో మహీ తిరిగి ప్రొషెషనల్ కెరీర్ను ఆరంభించడానికి అంతరాయం ఏర్పడింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు.
రాహుల్కి ఛాన్స్:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ రాహుల్కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.