
హైదరాబాద్: క్రికెట్ నుంచి మరో స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పీటర్సన్ పలు వివాదాలతో నాలుగేళ్ల క్రిందటే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైయ్యాడు. ఫిబ్రవరి నుంచి మొదలైన పీఎస్ఎల్లో ఆడుతున్న పేలవ ప్రదర్శనతోనే కొనసాగిస్తున్నాడు.
ఇదే తన చివరి టోర్నీ అని ప్రకటించిన అతను..గురువారం తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో అతను 6 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఈ టోర్నీలో పీటర్సన్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. 8 ఇన్నింగ్స్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే చేయగలిగాడు కెవిన్. ఐతే అతడి జట్టు క్వెటా గ్లాడియేటర్స్ ప్లేఆఫ్ దశకు అర్హత సాధించినప్పటికీ.. పీటర్సన్ ఇకపై టోర్నీ ఆడొద్దని నిర్ణయించుకున్నాడు.
భద్రత కారణాలతో పాకిస్థాన్లో పర్యటించొద్దని ఇప్పటికే నిర్ణయించుకున్న సహచర ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్ల బాటలోనూ కెవిన్లతో పీటర్సన్ కూడా ఏకీభవించాడు. శనివారం ట్విటర్లో తన బూట్లను చూపిస్తున్న ఫొటోను పంచుకున్న కెవిన్.. ''ఇక సెలవు. ధన్యవాదాలు'' అని ట్వీట్ చేశాడు. అనంతరం ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో నిండిన ఒక సందేశం ద్వారా పీటర్సన్ తన రిటైర్మెంట్పై స్పష్టత ఇచ్చాడు.
''నేను ప్రొఫెషనల్ కెరీర్లో 30 వేలకు పైగా పరుగులు, 152 అర్ధసెంచరీలు, 68 సెంచరీలు చేసినట్లు ఎవరో ట్వీట్ చేశారు. ఇంకా ఇంటా బయటా కలిపి 4 యాషెస్లు, టీ20 ప్రపంచకప్ గెలుపు, భారత్పై భారత్లో సిరీస్ విజయం, బంగ్లాదేశ్ మినహా అన్ని టెస్టు దేశాలపై శతకాలు.. ఇలాంటి ఘనతలెన్నో సాధించాను. ఇవన్నీ అన్ని రకాల సమయాల్లో నాకు అసాధారణ మద్దతు ఇచ్చిన నా కుటుంబానికి అంకితం. నేను సాధించిన అన్నింటికీ ఎంతో గర్వంగా ఉన్నా. క్రికెట్ అంటే నాకెంతో ప్రేమ'' అని పీటర్సన్ వివరించాడు.
పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్లో 104 టెస్టు మ్యాచ్లు, 136 వన్డేలు, 37 టీ-20 మ్యాచ్లు ఆడాడు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్లో 30వేల పరుగులు చేశాడు. 68 సెంచరీలు, 152 అర్ధసెంచరీలు ఉన్నాయి. తన పేలవ ఆటతీరుతో ఫాం కోల్పోయిన అతనిని 2013-14లో జరిగిన యాషెష్ సిరీస్లో జట్టులోకి తీసుకోకపోవడంతో అతని కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. అయితే, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక లీగ్ మ్యాచ్లలో అతను ఆడాడు.