మహీ నుంచే రోహిత్ నేర్చుకొన్నాడు
ఇన్స్టాగ్రామ్ లైవ్ షో 'సే యాష్ టు స్పోర్ట్స్'లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ యష్ కాశికర్తో కర్ణ్ శర్మ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ దాదాపు ఒకేలా ఉంటుంది. నాయకులుగా ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇదంతా మహీ నుంచే అతడు నేర్చుకొని ఉంటాడని నా అంచనా. ఎందుకంటే అతడి కెప్టెన్సీలో హిట్మ్యాన్ ఎన్నో మ్యాచులు ఆడాడు. ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారు. సొంతంగా ఫీల్డర్లను మోహరించేందుకు బౌలర్లకు స్వేచ్ఛనిస్తారు. అది పనిచేయకపోతేనే మరో ప్రణాళికతో వస్తారు' అని తెలిపాడు.
ఇద్దరూ సక్సెస్ఫుల్ కెప్టెన్లు
ప్రస్తుతం చెన్నై తరఫున ఆడుతున్న కర్ణ్ శర్మ.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబైకి గతంలో ఆడాడు. దాంతో ఇద్దరి కెప్టెన్సీని అతడు దగ్గరినుండి గమనించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్గా రోహిత్ నాలుగు టైటిల్స్ని అందించగా.. చెన్నై సూపర్ కింగ్స్కి ధోనీ మూడు టైటిల్స్ని అందించాడు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇద్దరూ సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. మైదానంలో ఇద్దరు కెప్టెన్లు బౌలర్లకి స్వేచ్ఛనిస్తారు.
మహీ లాంటి మరో క్రికెటర్ను చూడలేదు
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై స్పిన్నర్ కర్ణ్ శర్మ ప్రశంసలు కురిపించాడు. 'ఇంగ్లండ్పై టీ20లో అరంగేట్రం చేసినప్పుడు ధోనీ ఏం చెప్పాడో నాకింకా గుర్తుంది. జో రూట్కు గూగ్లీ విసరమన్నాడు. అతడు కచ్చితంగా రివర్స్ స్వీప్ ఆడతాడని చెప్పాడు. అలానే చేసి నేను రూట్ వికెట్ తీశాను. చెన్నైలో మేం సాధన చేసేటప్పుడూ వికెట్ల వెనకాల నుంచి మహీ ఎన్నో విలువైన సలహాలు ఇస్తాడు. ఆయన కన్నా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చే మరో క్రికెటర్ను నేను చూడలేదు' అని కర్ణ్ శర్మ అన్నాడు.
కఠిన సందర్భాల్లో ముందుకు సాగుతాడు:
'ప్రతి జట్టు కెప్టెన్ మీద ఆధారపడుతుంది. కెప్టెన్ ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్ ఒత్తిడిలోకి జారుకుంటే జట్టు మొత్తంమీద ఆ ప్రభావం పడుతుంది. మహీ ఉంటే అందుకు ఆస్కారం ఉండదు. సవాళ్లు మహీ స్వీకరించి కఠిన సందర్భాల్లో ముందుకు సాగుతాడు. ధోనీ నుంచి నేర్చుకొనేందుకు చాలా వుంటుంది' అని కర్ణ్ శర్మ చెప్పుకొచ్చాడు. కర్ణ్ శర్మ భారత్ తరఫున 1 టెస్టులు, 2 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.