అది నిజంగా గొప్ప విజయం.. టీమిండియాకు హ్యాట్సాఫ్: కేన్ మామ

వెల్లింగ్టన్: టీమిండియాపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించిందని కొనియాడాడు. గబ్బా విజయంతో భారతదేశమంతా గొప్ప అనుభూతి పొంది ఉంటుందన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో గెలుపు సాధించిన విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలిన తర్వాత గొప్పగా పుంజుకుంది. పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ, గాయాలతో ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమయినా యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత్ చారిత్రక విజయాన్ని సాధించింది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే సవాలు
కేన్ విలియమ్సన్ తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే ఓ సవాలు. అలాంటిది కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతోనే మ్యాచ్ అంటే అత్యంత కఠిన సవాలే. కానీ టీమిండియా అక్కడికి వెళ్లి ప్రదర్శించిన తీరు అభినందనీయం. ఎన్నో గాయాలు, ప్రధాన ఆటగాళ్లు దూరమైనా చిరస్మరణీయ విజయం సాధించింది. టెస్టు ఛాంపియన్షిప్ పోటీలో నిలవడానికి గొప్పగా పోరాడి ఉంటారు. అయితే ప్రతికూలతల్లోనూ వాళ్లు ధైర్యంగా నిలబడి విజయం సాధించిన తీరు అమోఘం. ఈ విజయం ఎందరికో స్ఫూర్తి' అని అన్నాడు.

గొప్ప విజయం
'గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టుకు కేవలం 7-8 మ్యాచ్ల అనుభవం ఉన్న బౌలింగ్ దళంతో టీమిండియా బరిలోకి దిగింది. అయినా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. ఆ విజయంతో భారతదేశమంతా గొప్ప అనుభూతి పొంది ఉంటుంది. కేవలం అభిమానులే కాదు, ఆటగాళ్లు కూడా ఎంతో ఆస్వాదించి ఉంటారు. ఐపీఎల్ 2020 నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు.. గబ్బా విజయంతో కుటుంబంతో కలిసి మరింత సంతోషంగా సమయాన్ని గడిపి ఉంటారు' అని కేన్ మామ పేర్కొన్నాడు. కేన్ ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఆరు నెలలు ఇంట్లోనే ఉన్న భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2020 కోసం యూఏఈకి వెళ్లారు. దుబాయ్ నుంచే నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. సుదీర్ఘ ఆసీస్ పర్యటన ముగించుకుని జనవరి మూడో వారంలో స్వదేశానికి తిరిగొచ్చారు. ఓ వారం పాటు కుటుంబంతో సరదాగా గడిపిన భారత ప్లేయర్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం చెన్నైలో బయోబబుల్లో ఉంటున్నారు. మంగళవారమే ఆరు రోజుల క్వారంటైన్ పూర్తిచేసి సాధన మొదలెట్టారు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో చెపాక్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ఆడనుంది.

నేరుగా ఫైనల్కు కేన్ సేన
దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా తన టూర్ను రద్దు చేసుకోవడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో న్యూజిలాండ్ నేరుగా ఫైనల్ చేరింది. ఇప్పుడు మరో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్ ఫైట్ చేయనున్నాయి. భారత్ ఫైనల్కు క్వాలిఫై కావాలంటే ఇంగ్లండ్పై కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లండ్ మాత్రం నాలుగు టెస్టుల్లో కనీసం మూడు గెలిస్తేనే ఫైనల్కు క్వాలిఫై అవుతుంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. భారత్, ఇంగ్లండ్ సిరీస్ డ్రా అయితేనే ఆ టీమ్ ఫైనల్కు వెళ్తుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకూ లండన్లోని లార్డ్స్లో జరగనుంది.
India vs England: వామ్మో.. భారత జట్టులో వాళ్లంతా డేంజరే: జోఫ్రా ఆర్చర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications