కరాచీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై పాకిస్థాన్ మాజీ వికెట్కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్ క్రికెట్ సొంతమని అక్మల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్ క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని తెలిపాడు. దీనికి ఆ దేశ క్రికెట్ బోర్డు అవలంబిస్తున్న విధానాలే కారణమని తెలిపాడు. దేశవాళీ క్రికెట్, భారత్-ఏ పర్యటనలతో పాటు ఐపీఎల్ మేటీ ఆటగాళ్లను అందిస్తుందన్నాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో అక్మల్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక పర్యటనకు భారత్ సీ టీమ్ వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్నాడు.
'భారత్ త్వరలో రెండు జట్లను బరిలోకి దించుతోంది. ఈ ఘనత అంతా టీమిండియాదే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. మరొక టీమ్ శ్రీలంక టూర్కు వెళ్లనుంది. ఏక కాలంలో రెండు జట్లతో రెండు సిరీస్ల్లో పాల్గొననుంది. వారి క్రికెట్ సంస్కృతి చాలా బలంగా ఉంది. రెండు కాదు మూడు జట్లను కూడా ఫీల్డ్లోకి దించగల సత్తా టీమిండియాకు ఉంది. ప్రారంభ స్థాయి నుంచి దృఢమైన ఆటగాళ్లు ఉండటమే ఇందుకు కారణం.
యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది క్రికెటర్లను తయారు చేశాడు. కోచ్ రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడు. విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడు. అతడు గాయపడితే కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. ఇలా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఒకవేళ ఇండియా-సీ టీమ్ను శ్రీలంక పర్యటనకు పంపినా.. అది గెలుస్తుంది" అని అక్మల్ చెప్పుకొచ్చాడు.
ఓ వైపు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. మరోవైపు అదే సమయంలో మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్కు వెళ్లనుంది. ఇప్పటికే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్లారిటీ ఇవ్వడంతో పాటు రెండో జట్టుకు కోచ్గా భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించింది.
ఇంగ్లండ్ పర్యటనకు సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, ఆర్.అశ్విన్తో కూడిన జంబో జట్టును ఎంపిక చేయగా.. శ్రీలంక టూర్కు వెళ్లే జట్టు టీమ్ ఇంకా ఎంపిక చేయలేదు. ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో పాటు భారత్-ఏ తరఫున రాణిస్తున్న ప్లేయర్లకు ఈ టీమ్లో చోటు దక్కనుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్కు ఈ జట్టు సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి.