

న్యూ ఢిల్లీ: ఆసియా కప్ గెలిచిన సందర్భంగా టీమిండియా విజయోత్సాహంలో ఉంటే బుమ్రా మాత్రం.. గతేడాది తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. 'కొంతమంది తమ సృజనాత్మకతను బయటపెట్టుకోవాలని ఆరాట పడుతుంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ అది ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. ఇప్పుడు ఈ విజయం వారికి చెంపపెట్టు అనుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
దానికి ఆసియాకప్ను చేతిలో పట్టుకున్న ఫొటోను జత చేశాడు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో భాగంగా పాకిస్థాన్తో తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్పై పాక్ ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్లో బుమ్రా చేసిన స్వల్ప పొరబాటు చర్చలకు దారి తీసింది. సోషల్మీడియాలో బుమ్రాపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీనికితోడు పుండుమీద కారం చల్లినట్లు రాజస్థాన్ ట్రాఫిక్ పోలీసులు టీమిండియా వైఫల్యాన్ని వారి ప్రచారానికి ఉపయోగించారు. 'మీ హద్దులను దాటకండి. ఒకవేళ దాటితే మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అంటూ రాసి పాక్-భారత్ మ్యాచ్లో బుమ్రా చేసిన తప్పిదాన్ని బ్యానర్ల రూపంలో కట్టి రద్దీ ప్రదేశాల్లో ఉంచారు.
అప్పట్లో ఇది వివాదాస్పదంగా మారడంతో మళ్లీ ఆసియాకప్లో భాగంగా బుమ్రా అవకాశం వచ్చినప్పుడల్లా చెలరేగిపోవడంతో తన సత్తా చాటుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ బుమ్రా అనేకసార్లు మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈరోజు బుమ్రా చేసిన ట్వీట్కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.