నాటింగ్హామ్: కెమెరా కంటికి కనిపించకుండా చేసిన కఠోర సాధన, ఫిట్నెస్ ప్రస్తుతం ఫలాలను అందిస్తున్నాయని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్టు కెరీర్లో అతడు రెండో సారి ఐదు వికెట్ల ఘనత సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 521 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను బుమ్రా 5/85తో భారీ దెబ్బకొట్టాడు.
'నా అరంగేట్రం ఫస్ట్క్లాస్ మ్యాచ్లో తొలి స్పెల్లోనే నేను 10 ఓవర్లు వేశాను. రంజీ ట్రోఫీలో ఎప్పుడూ చాలా ఓవర్లు విసిరేవాడిని. అదే నాకిప్పుడు సాయం చేసింది. గాయపడ్డప్పుడు నా ఫిట్నెస్, శిక్షణపై దృష్టిపెట్టాను. ఎవ్వరికీ ఏదీ అంత సులువుగా దక్కవు. చాలా కష్టపడాలి. అప్పటి కష్టమే ఇలాంటి సమయాల్లో మనకు విజయాల్ని అందిస్తుంది. బౌలింగ్ కోచ్ అరుణ్ దగ్గర మేం చాలా నేర్చుకున్నాం.'
WATCH: Bowling duo @ImIshant & @Jaspritbumrah93 discuss team's impressive bowling show at Trent Bridge 😎👌 #TeamIndia #ENGvIND - by @RajalArora
— BCCI (@BCCI) August 22, 2018
Video Link ▶️https://t.co/XgXjHejb0c pic.twitter.com/E5gdJYQf42
'సాధ్యమైనంత వరకు జిమ్లోనే కాలం గడుపుతా. ట్రెడ్ మిల్ను ఉపయోగించి పరిగెత్తుతా. ఆనాడు మేం కెమెరాలకు దూరంగా పడిన కష్టమే మంచి ఫలితాలనిస్తోంది. తెలుపు బంతితో పోలిస్తే ఎరుపు బంతి క్రికెట్లో ఓర్పు, నిలకడ అవసరం. ఇంగ్లాండ్తో నాలుగో రోజు వాటిపై దృష్టి నిలిపా. నేనెప్పుడూ మంచి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరి బ్యాట్స్మెన్కు సవాల్ విసరాలని ప్రయత్నిస్తా.'
'అలా చివర్లో మనకు వికెట్లు లభిస్తాయి. బట్లర్ దూకుడైన ఆటగాడు. త్వరగా నిలదొక్కుకుంటే అతడు సమస్యలు సృష్టిస్తాడు. ఇంతకు ముందు నాకు సహాయపడ్డ బలాబలాలపైనే దృష్టి సారించా. అదే బట్లర్ వికెట్ తీసేలా చేసింది. అప్పటి వరకు పాత బంతితోనూ స్థిరంగా బౌలింగ్ చేశాం. కొత్త బంతికి సీమ్ తోడైంది. గాయపడ్డప్పటికీ నెట్స్లో సాధన చేశా. ఫిట్నెస్పై దృష్టిపెట్టా' అని బుమ్రా పేర్కొన్నాడు. ఇంకా మొదటి 2 మ్యాచ్లు ఓడిపోవడంతో ఇప్పుడు ప్రతి మ్యాచ్ గెలిస్తేనే మేం విజయం సాధించగలమని అలా కచ్చితంగా చేసి తీరతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.