హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయ్యర్ సాధించిన పరుగులే అతడెంటో చూపిస్తాయి. ఇప్పటివరకు 53.46 యావరేజితో 4117 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి.
గతేడాది మొత్తం అయ్యర్ అద్భుతమైన ఫామ్ను కనబర్చాడు. గతేడాది భారత-ఏ తరఫున న్యూజిలాండ్-ఏ జట్టుతో ఆడిన సిరీస్లో అయ్యర్ 317 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.
ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో స్థిరంగా పరుగులు చేస్తూ, పలు టోర్నీల్లో సత్తా చాటుతున్నప్పటికీ భారత జట్టులో చోటు కోసం ఓపిగ్గా ఎదురుచూడటం ఎంతో కష్టతరంగా ఉందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో తలపడిన ఇండియా-ఏ జట్టుకు అయ్యర్ సారథ్య బాధ్యతలు వహించాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో ఆడిన రెండు అనధికార టెస్టు మ్యాచ్ల సిరిస్ ను భారత జట్టు 1-0తో కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్లో అయ్యర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
తాజాగా మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో "దేశవాళీతో పాటు మిగతా టోర్నీల్లోనూ రాణిస్తూ కూడా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూడటానికి చాలా ఓపిక కావాలి. ఇది చాలా కఠినతరం. మంచి ప్రదర్శన చేస్తున్నప్పుడు కూడా ఎందుకు చోటు దక్కడంలేదన్న ఆలోచన మన మెదుడులో తిరుగుతూనే ఉంటుంది" అని అన్నాడు.
"నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో మన ప్రదర్శనలో మార్పులు వస్తుంటాయి. అలాంటి సమయంలో దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నానో అప్పటి నుంచి నా వ్యక్తిత్వం, స్వభావం మారాయి" అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
"దీన్ని నేను గుర్తించాను. జట్టు విజయం కోసం ప్రయత్నిస్తూ నా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. అలాగే ఒత్తిడిని జయించి ఆడాలి" అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.