
హైదరాబాద్: టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ శనివారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ పఠాన్ తన కెరీర్లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు.
మూడు ఫార్మాట్లు కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 పరుగులు సాధించాడు. టీమిండియా అందించిన ఉత్తమ ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠానే. సుమారు తొమ్మిదేళ్లపాటు ఇర్ఫాన్ పఠాన్ భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
2012లో టీమిండియా తరుపున చివరగా ఆడిన ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ జట్టుకు కోచ్గా వ్వవహారిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ అనగానే అభిమానులకు గుర్తుకు వచ్చేది పాకిస్థాన్పై టెస్టుల్లో హ్యాట్రిక్. 2006లో పాక్ పర్యటనకు వెళ్లిన ఇర్పాన్ పఠాన్ తన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ తీశాడు.
సల్మాన్ భట్, యునిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ల వికెట్లు తీయడం ద్వారా ఇర్ఫాన్ ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడొగట్టాడు.
ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. పెర్త్ వికెట్పై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్ర పోషించాడు. అయితే, తరచూ గాయాలు పాలవడం, జట్టులో చోటు కోల్పోవడం అతడి కెరీర్ను క్షీణించేలా చేశాయి.