దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. దేవదూత్ పడిక్కల్ (33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), శివం దూబే ( 22 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసి.. చెన్నై ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా.. సామ్ కరాన్, దీపక్ చాహర్లకు తలో వికెట్ లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే ఓపెనర్ అరోన్ ఫించ్ (2) వికెట్ను కోల్పోయింది. దీపక్ చాహర్ మూడో ఓవర్ ఐదో బంతికి ఫించ్ పెవిలియన్ చేరాడు. దాంతో ఆర్సీబీ 13 పరుగుల వద్ద తొలి వికెట్ను చేజార్చుకుంది. ఆ తరుణంలో దేవదూత్ పడిక్కల్, విరాట్కోహ్లీలు జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి 53 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. ఆ వెంటనే స్టార్ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ డకౌట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ తన పదునైన బంతులతో పడిక్కల్, డివిలియర్స్లను ఒకే ఓవర్లో ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు.
అనంతరం వాషింగ్టన్ సుందర్ (10) కూడా నిరాశపరిచాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. చివరి వరకూ క్రీజ్లో ఉండాలనే తపనతో పెద్దగా షాట్లకు వెళ్లకుండా స్టైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే స్లాగ్ ఓవర్లలో కోహ్లీ బ్యాట్ ఝుళిపించి స్కోరులో వేగం పెంచాడు.
చెన్నై బౌలర్ల ధాటికి బెంగళూరు 130 స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న తన జట్టుకు విరాట్ కోహ్లీ ప్రాణం పోశాడు. 16 ఓవర్లకు 103/4తో ఉన్న బెంగళూరును.. 20 ఓవర్లకు 169/4తో పటిష్ఠ స్థితికి చేర్చాడు. కోహ్లీ ఒక్కడే విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. చివర్లో శివమ్ దూబే ఫర్వాలేదనిపించాడు. విరాట్ బ్యాటింగ్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోరు చేసింది ఆర్సీబీ. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (2/40) రెండు వికెట్లు తీయగా.. శామ్ కరన్, దీపక్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.