ముంబై స్కోరు మందగించింది:
సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో కలిపి (72), ఇషాన్ కిషన్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో కలిపి (58)లతో హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే వీరు ఐదు పరుగుల వ్యవధిలో వరుసగా పెవిలియన్ చేరడంతో ముంబై స్కోరు మందగించింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా ఔట్ కాగా, పొలార్డ్(21 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో కృనాల్ పాండ్యా(7)హార్దిక్ పాండ్యా(4), మిచెల్ మెక్లీన్గన్(0) నిరాశపరిచారు.
ఆడిన తొలి బంతికే ముగ్గురు పెవిలియన్ చేరారు:
ఈ మ్యాచ్లో ముగ్గురు ముంబై ఆటగాళ్లు గోల్డెన్ డక్గా ఔట్ కావడం గమనార్హం. ఎవిన్ లూయిస్, రోహిత్ శర్మ, మెక్లీన్గన్లు ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు సాధించగా, కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. ఉనాద్కత్కు వికెట్ లభించింది.
రోహిత్ శర్మ డైమండ్ డకౌట్:
ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆదివారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. రోహిత్ తను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్గా ఔటయ్యాడు. ఫలితంగా ఐపీఎల్లో తొలిసారి గోల్డెన్ డక్గా ఔటైయ్యాడు రోహిత్. ఈ లీగ్లోనే గతంలో రోహిత్ శర్మ డైమండ్ డకౌట్(బంతులేమీ ఆడకుండా ఔట్ కావడం)గా పెవిలియన్ చేరాడు. 2011లో కేకేఆర్తో వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రోహిత్ డైమండ్ డక్గా ఔటయ్యాడు.
అజింక్యా రహానేను తక్కువ అంచనా వేసి:
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో భాగంగా రాజస్థాన్ బౌలర్ ఉనాద్కత్ వేసిన 16 ఓవర్ నాల్గో బంతికి రోహిత్ బంతిని నాన్ స్టైకర్ ఎండ్వైపు ఫ్లిక్ చేసి పరుగు కోసం యత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానేను తక్కువ అంచనా వేసి పరుగును పూర్తి చేయబోయాడు. కాగా, రహానే అమాంతం బంతిని అందుకున్న వెంటనే డైవ్ కొడుతూ వికెట్లపైకి విసరడంతో రోహిత్ భారంగా పెవిలియన్ చేరాడు.