బీసీసీఐ ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్లకు స్టేడియంలలోకి పూర్తి కెపాసిటీ మేరకు ప్రేక్షకులు వచ్చి వీక్షించేందుకు అనుమతినిచ్చింది. అలాగే ప్లేఆఫ్ వేదికలను కూడా ఖరారు చేసింది. కోల్కతా, అహ్మదాబాద్లలో ఐపీల్ ప్లేఆఫ్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా.. మే 24న క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరుగుతుంది. మే 25న అదే వేదికగా.. ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
మధ్యలో ఒకరోజు గ్యాప్ తర్వాత మే 27న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 జరుగుతుంది. మరో రోజు గ్యాప్ తర్వాత మే 29న అదే వేదికపై ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇకపోతే రెండేళ్లుగా ఐపీఎల్ నేరుగా వీక్షించేందుకు ప్రేక్షకులను పరిమితంగానే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ప్రేక్షకులను స్టేడియంలలోకి అనుమతించనుండడం గమనార్హం.
గత రెండు సీజన్లలో కోవిడ్-19 వల్ల చాలా మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరిగాయి. ఇంకొన్ని మ్యాచ్ల్లో ప్రేక్షకులను పరిమితంగా అనుమతించి జరిపారు. అలాగే ప్రస్తుత ఐపీఎల్-2022 సీజన్ కోసం.. బీసీసీఐ పటిష్ఠ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే వేదికలను తగ్గించింది. కేవలం మహారాష్ట్రలోని నాలుగు వేదికలపై మాత్రమే లీగ్ను నిర్వహిస్తోంది. కరోనా, బయోబబుల్ కారణంగా ప్లేయర్ల రక్షణ, లీగ్ నిర్వహణ దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో స్టేడియం కెపాసిటీలో 25%మంది ప్రేక్షకులకు మాత్రమే బీసీసీఐ అనుమతించింది. తర్వాత కోవిడ్ పరిస్థితులు బాగా తగ్గుముఖం పట్టడంతో స్టేడియం కెపాసిటీలో 50% మంది ప్రేక్షకులను అనుమతిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశలో మ్యాచ్లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలలో మ్యాచ్లు జరుగుతున్నాయి.
ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లకు కోల్కతా, అహ్మదాబాద్లలోని స్టేడియాలు ఆతిథ్యమిచ్చాయి. వన్డే సిరీస్ అహ్మదాబాద్లో పూర్తిగా ప్రేక్షకులు లేకుండా జరగగా.. టీ20సిరీస్ మాత్రం స్టేడియం సామర్థ్యంలో 75శాతం మేర ప్రేక్షకులను అనుమతిస్తూ కోల్కతాలో జరిగింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ నాకౌట్ దశ మ్యాచ్ల విషయానికొస్తే.. కోల్కతా, అహ్మదాబాద్లలో నిర్వహిస్తాం. మే 22న లీగ్ దశ ముగిసిన తర్వాత మ్యాచ్లకు 100%ప్రేక్షకులను అనుమతిస్తాం. అలాగే మే 24నుంచి 28వరకు లక్నోలో మూడు జట్ల మహిళల టీ20 ఛాలెంజ్ కూడా జరుగుతుంది' అని గంగూలీ తెలిపారు. ఇక 50శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నప్పుడే స్టేడియాలు హోరెత్తిపోతుంటే.. 100శాతం అనుమతిస్తే ఇంకా దద్దరిల్లడం ఖాయం.