|
ప్లేఆఫ్ బెర్త్..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబి స్టేడియంలో బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ ఖాయం అయ్యే మ్యాచ్ అది.
హైఓల్టేజ్లో సాగింది. కీలకమైన ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అటు బ్యాటింగ్, బౌలింగ్లో మెరుగ్గా కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్.. 164 పరుగులే చేసింది. ఈ టార్గెట్ను ముంబై ఇండియన్స్ అలవోకగా ఛేదించింది. 19 .1 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ప్లేఆఫ్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
|
కోహ్లీలో అసహనం..
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకవైపు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడుతుండటం..వన్డౌన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లో పాతుకునిపోయి స్వేచ్ఛగా, ధాటిగా భారీ షాట్లను ఆడటం కోహ్లీకి మంటెక్కించినట్టుంది. తన అసహనాన్ని అతను ఎంతో సేపు దాచుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ను రెచ్చగొట్టేలా వ్యవహరించాడు.
|
సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్లి మరీ..
ఇన్నింగ్ 13వ ఓవర్ చివరి బంతిని సూర్యకుమార్ యాదవ్ కవర్స్ వైపు షాట్ ఆడాడు. అక్కడే కాచుకుని ఉన్న విరాట్ కోహ్లీ బంతిని అందుకున్నాడు. ఆ వెంటనే కోపంతో సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వచ్చాడు. అతనికి వద్దకు వచ్చే సమయంలో కోహ్లీ అతణ్ని ఉద్దేశించిన ఏదో చెప్పడం కనిపించింది. ఆగ్రహంతో వచ్చిన కోహ్లీ.. క్రీజ్లో నిల్చున్న సూర్యకుమార్ పక్కకు వచ్చి నిల్చున్నాడు. కొన్ని సెకెన్ల తరువాత..కోహ్లీ పక్కన ఉండగానే యాదవ్ అక్కడి నుంచి నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్లాడు. యాదవ్ అక్కడి వెళ్లినప్పటికీ కోహ్లీ కొద్దిసేపు క్రీజ్లోనే ఉన్నాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు వెళ్తోన్న యాదవ్ వైపు కోహ్లీ ఎర్రబడ్డ ముఖంతో చూస్తూ ఉండిపోయాడు.
|
మరోసారి సత్తా చాటిన యాదవ్..
ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన సత్తా చాటాడు. 43 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. రెండు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. అతణ్ని ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్న సమయంలో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్టర్లకు సూర్యకుమార్ యాదవ్.. తన బ్యాట్తో మరోసారి సమాధానం చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీమిండియా కోచ్ రవిశాస్త్రి సహా పలువురు మాజీ క్రికెటర్లు యాదవ్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.