న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం కపిల్ దేవ్ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో కొద్ది సేపటి క్రితం డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
కపిల్కు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్ అతుల్ మథుర్తో కలిసి దిగిన ఫొటోను చేతన్ శర్మ ట్విటర్లో పంచుకొని ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారని చెప్పారు. అంతకుముందు ఆసుపత్రి బెడ్పై నవ్వుతూ డబుల్ థమ్సప్ చూపుతున్న కపిల్ ఫొటోను చేతన్ శర్మ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కపిల్ పక్కన కూతురు అమియా కూడా ఉన్నారు. కపిల్ పాజీ చక్కగా కోలుకుంటున్నాడని ఆయన ట్వీట్ చేశారు.
కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మదన్ లాల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ ట్వీట్లు చేశారు. అందరి ప్రార్ధనలతో కపిల్ క్షేమంగా బయటపడడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
భారత దేశానికి ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్గా కపిల్ దేవ్ చరిత్ర సృష్టించారు. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ 'హరియాణా హరికేన్'ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్ దేవ్ భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశారు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించారు. ఇంటికి చేరుకున్న కపిల్ ఐపీఎల్ 2020 మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేయాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.