

హైదరాబాద్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐపీఎల్లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రకటించింది. టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి రిషబ్ పంత్ కొట్టిన షాట్ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు. దీంతో నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న బుమ్రా మైదానంలోనే కప్పుకూలాడు. అంతేకాదు ముంబై ఇన్నింగ్స్లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రాలేదు.
దీంతో బుమ్రా గాయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్కప్కు ముందు బుమ్రాకు గాయం కావడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో బుమ్రాకు ఏం కాలేదని, అతని గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసింది. "బుమ్రా ఫిట్గానే ఉన్నాడు. అతడి భుజం కుదించికుపోయింది అంతే. అతడి గాయం అంత సీరియస్ ఏం కాదు. అతడు టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు" అని పేర్కొంది.
"మే నెలలో వరల్డ్కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్కు పంపించలేదు. కానీ, అతనికెలాంటి ఇబ్బంది లేదు. తర్వాతి మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి వస్తాడు" అని ముంబై ఇండియన్స్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, తాజా సీజన్ను ముంబై ఇండియన్స్ ఓటమితో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు.
ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (0) కూడా ఔటవడంతో మ్యాచ్పై ముంబై పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.