హైదరాబాద్: అసలే చెన్నైవాసులకు అభిమానం ఎక్కువ. దానికి తగ్గట్టుగా వరల్డ్ ఫేమస్ ధోనీ ఆ జట్టుకు కెప్టెన్. ఈ రెండూ తోడైతే అభిమానం వ్యక్తపరచడంలో హద్దే ఉండదు. ఇలా చెన్నైలోనే కాదు. అంతకుముందు పూణె జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు వహించిన ధోనీపై అక్కడ కూడా అంతే స్థాయిలో అభిమానం ఉంది.
ఐపీఎల్ సీజన్11లో ధోనీ డగౌట్లో కూర్చుని ఉండగా ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటి వచ్చి అతని కాళ్లను మొక్కాడు. ధోనీ అంటే అంత అభిమానం అందరికీ. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానులు ఒక చిరు కానుక అందజేశారు.
This #yellove is unparalleled. #PuneGroundStaff #whistlepodu #CSKvSRH 🦁💛 pic.twitter.com/grfinBY9Sj
— Chennai Super Kings (@ChennaiIPL) May 13, 2018
టోర్నీలో భాగంగా పూణె వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కావేరి జల వివాదం కారణంగా సొంతగడ్డపై ఆడాల్సిన మ్యాచ్లన్నీ చెన్నై సూపర్ కింగ్స్ పుణెలో ఆడుతోంది. పూణె అభిమానుల నుంచి వస్తోన్న ఆదరణ, మద్దతు చూసి చెన్నై ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్ అనంతరం పూణె మైదానం సిబ్బంది ధోనీకి ఒక చిరు కానుక అందజేశారు.
జీవాను ఎత్తుకుని ఉన్న ధోనీ చిత్రపటాన్ని వారు ధోనీకి అందించారు. అనంతరం ధోనీతో కలిసి సిబ్బంది ఫొటోలు కూడా దిగారు. మే 1న కార్మికుల దినోత్సవం నాడు ధోనీ మైదాన సిబ్బందితో కాసేపు సరదాగా గడిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫ్రాంఛైజీ నిర్వాహకులు ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్పై విజయంతో చెన్నై ప్లేఆఫ్కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా తరవాత మ్యాచ్లో భాగంగా చెన్నై.. ఢిల్లీ డేర్డెవిల్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లో చెన్నై ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే పుణెలో ఆడనుంది. మే20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో చెన్నై తలపడనున్న మ్యాచ్ పూణె వేదికగా జరగనుంది.