హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో పరీక్ష ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే. ఈ టెస్టు పాసైతేనే జట్టులో చోటు దక్కించుకుంటారు. ఇటీవల షమీ, అంబటి రాయుడులాంటి కొందరు స్టార్ క్రికెటర్లు ఈ పరీక్షలో ఫెయిలవడం.. జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడాన్ని మనం చూశాం.
ఆ తర్వాత యో-యో టెస్టులో పాసైన షమీ తిరిగి ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ఎంపికయ్యాడు. తాజాగా ఈ టెస్టును భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కూడా ఎదుర్కొన్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన టెస్టుకు స్టార్ బౌలర్ జులన్ గోస్వామి సహా కొందరు క్రీడాకారిణులు హాజరయ్యారు.
తామంతా యో-యో టెస్టుని విజయవంతంగా అధిగమించామని గోస్వామి తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. "బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో జట్టు సభ్యులందరం పాసయ్యాం" అని గోస్వామి తన ట్విట్టర్లో పేర్కొంది.
ప్రస్తుతం కొందరు జట్టు సభ్యులు ఇతర దేశాల్లో లీగ్లు ఆడుతున్నందున యో యో టెస్టులో పాల్గొనలేకపోయారు. ఈ కారణంగా వీరు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వీరు కూడా హాజరవుతారని అకాడమీ అధికారులు తెలిపారు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన భారత్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
yo yo done 🔝💯 #day1 #welldonegirls👏 pic.twitter.com/4RKNC5aC8G
— Jhulan Goswami (@JhulanG10) July 26, 2018