ఆంటిగ్వా: వెస్టిండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఓ అనుకోని అతిథి సర్ప్రైజ్ ఇచ్చాడు. వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివ్ రిచర్డ్స్ తొలి టెస్టు కోసం ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్న టీమిండియా ఆటగాళ్లను కలిసి వారిలో నూతన ఉత్సహాన్ని నింపాడు.
దీంతో తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ క్రికెటర్ రావడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు వివ్ రిచర్డ్స్తో కలిసి ఉన్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో సెంచరీలు సాధించిన విరాట్ను మెచ్చుకున్నాడు. కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని అభినందించాడు.

మరోవైపు ప్రశాంతమైన వదనంతో ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను సైతం ప్రశంసించాడు. వెస్టిండిస్తో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఆడేందుకు వచ్చిన టీమిండియాకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. స్టువర్ట్ బిన్నీతో మాట్లాడిన ఆయన అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో 1983 ప్రపంచకప్ రోజులను గుర్తుచేసుకున్నాడు.
తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జులై 21న ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ సిటీలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ధోని నేతృత్వంలో టీమిండియా చివరిసారిగా 2011లో వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది.