మీకోసం: ఆఖరి వన్డేలో మీరు గుర్తించని ఐదు విషయాలివే


హైదరాబాద్: వెస్టిండిస్తో ఐదు వన్డేల సిరిస్ను భారత్ ఘనంగా ముగించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 9 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్ను టీమిండియా 3-1తేడాతో సొంతం చేసుకుంది.
వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్ను కోహ్లీసేన నెగ్గడం విశేషం.
భారత్ చివరిసారి 2015లో సొంతగడ్డపై వన్డే సిరిస్ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కెప్టెన్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులకే పెవిలియన్కు చేరగా, రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు.
మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వన్డేల్లో 200వ సిక్సర్ బాదాడు. కేవలం 187 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో ఐదు గుర్తించని విషయాలు మీకోసం...

#5 టాస్ని వైట్వాష్ చేసే అవకాశాన్ని కోల్పోయిన విరాట్ కోహ్లీ
తిరువనంతపురు వేదకగా ముగిసిన ఆఖరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడంతో ఓ అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. ఈ సిరీస్లో నాలుగు టాస్లనూ కోహ్లీయే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించేవాడు. దీంతో పాటు ఓ సిరీస్లో వరుసగా ఐదు టాస్లు గెలిచిన నాలుగో భారత కెప్టెన్ అయ్యేవాడు. గతంలో అజహరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక, వెస్టిండిస్ జట్టుపై ఇలా వరుసగా ఐదు మ్యాచ్ల్లో టాస్లు గెలిచిన కెప్టెన్లలో హ్యాన్సీ క్రోనే(దక్షిణాఫ్రికా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా) ఉన్నారు.

#4 టాప్లో పోవెల్ జోడీ
ఈ సిరిస్లో వెస్టిండిస్ జట్టు రెగ్యులర్ ఓపెనర్లు క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ సేవలను మిస్సైన సంగతి తెలిసిందే. అందుకు కారణం ఈ ఇద్దరూ భారత్లో వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకపోవడమే. దీంతో ఈ ఐదు వన్డేల సిరిస్లో వెస్టిండిస్ జట్టు కొత్త ఓపెనర్లతో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. భారత పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టెస్టు సిరిస్లో కీరన్ పోవెల్కు ఓపెనర్గా ఛాన్స్ ఇవ్వగా, వన్డేల్లో చంద్రపాల్ హేమ్రాజ్కు జట్టు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. అయితే వీరిద్దరూ ఓపెనర్లగా విజయవంతం అయ్యారు. అయితే, వన్డే సిరిస్లో ఆఖరి వన్డేలో వెస్టిండిస్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. హేమ్రాజ్ను తప్పించి అతడి స్థానంలో ఆరో స్థానంలో ఆడే రోవ్మన్ పోవెల్కు ప్రమోషన్ కల్పించింది. దీంతో ఆఖరి వన్డేలో ఓపెనర్లుగా ఇద్దరు పోవెల్లు బరిలోకి దిగారు.

#3 భారత్లో వెస్టిండీస్కు ఇదే అత్యల్ప స్కోరు
వన్డేల్లో భారత్పై వెస్టిండీస్కు ఇదే అత్యల్ప స్కోరు (104) కావడం విశేషం. అంతేకాదు సొంత గడ్డపై జరిగిన వన్డేను టీమిండియా ఇంత త్వరగా (46.4 ఓవర్లలో) ముగించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.

#2 మైలురాళ్లను మిస్సైన భువనేశ్వర్ కుమార్, ధోని
ఐదో వన్డేకు ముందే టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు తమ కెరీర్లో అరుదైన మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని ఒక పరుగు దూరంలో ఉండగా... భువనేశ్వర్ కుమార్ వన్డేల్లో 100వ వికెట్కు చేరువయ్యాడు. ఈ ఇద్దరూ ఈ మ్యాచ్లో ఈ రికార్డులను అందుకోలేకపోయారు.
ఇప్పటికీ 332 వన్డేలు ఆడిన ధోనీ.. 10,173 పరుగులు చేశాడు. కానీ భారత్ తరఫున మాత్రం చేసింది 9999 పరుగులే. 2007లో ఆసియా ఎలెవన్ తరఫున 3 మ్యాచ్లు ఆడిన మహీ 174 పరుగులు చేశాడు. విండీస్తో జరగనున్న చివరి వన్డేలో మరో పరుగు చేస్తే... కోహ్లీ, సచిన్, ద్రవిడ్ లాంటి ఆటగాళ్ల సరసన ధోని చేరతాడు. అయితే, ఐదో వన్డేలో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశమే లేదు.
ఇక, భువనేశ్వర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి ముందు 98 వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే చేశాడు. ఆఖరి వన్డేలో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు.

#1 సొంతగడ్డపై భారత విజయ పరంపర
ఆఖరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రికార్డు స్థాయిలో విండీస్ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్ను కోహ్లీసేన నెగ్గడం విశేషం. భారత్ చివరిసారి 2015లో సొంతగడ్డపై వన్డే సిరిస్ను చేజార్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications