మ్యాచ్కు వర్షం ముప్పు:
తొలి వన్డే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సహజంగా చెన్నైలో ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీనికి తగ్గట్టుగానే గత రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఈ రోజు కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. అయితే ఆదివారం వర్షం పడే అవకాశాలు కేవలం 20 శాతం మాత్రమే అని సమాచారం తెలుస్తోంది.
పిచ్ స్పిన్నర్లకు అనుకూలం:
గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చెపాక్ పిచ్ స్లోగా ఉంటూ.. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లు స్పిన్నర్లపైతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. చాహల్, కుల్దీప్ ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించారు.
చివరి రెండు వన్డేల్లో విజయం:
చెన్నైలో భారత్ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. ఇదే వేదికపై వెస్టిండీస్తో టీమిండియా నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్ల్లో గెలుపొంది, మరో రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించింది.
విజయమే అంతిమ లక్ష్యం:
విండీస్ కెప్టెన్ పొలార్డ్ మాట్లాడుతూ... 'వన్డే క్రికెట్ ఎలా ఆడాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉంది. వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నాం. పూర్తిగా కుర్రాళ్లు ఉన్నారు. వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని సార్లు బాగా ఆడినా గెలువలేకపోవచ్చు. ఆఫ్ఘన్పై సిరీస్లో మంచి ఫలితాలను రాబట్టాం. దాన్నే కొనసాగించాలనుకుంటున్నాం. టీంఇండియాపై విజయం సాధించాలన్నదే మా అంతిమ లక్ష్యం' అని అన్నాడు.