
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక వన్డే సిరీస్పై కన్నేసింది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది. అయితే, తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న ప్రొవిడెన్స్ స్టేడియంలో జోరున వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
మ్యాచ్ ఆరంభమయ్యే సమయంలో వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ చెప్పినట్టే మ్యాచ్కు ముందుగానే వర్షం కురుస్తోంది. అయితే కొంత సేపటి తరువాత వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఓవర్లను కుదించి అంపైర్లు ఆటను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రపంచకప్ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్లో అంచనాల్ని మించి రాణించిన కోహ్లీసేన... అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ను మొదలుపెట్టే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 130 వన్డేలు ఆడి 17 సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్తో వన్డే సిరిస్లో శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో కేఎల్ రాహుల్ను 4వ స్థానంలో బ్యాటింగ్కు పంపాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.