లక్ష్యం 208 పరుగులే..
అంత కష్టమైందేమీ కాదు. ఇంకా ఐదు సెషన్ల సమయం మిగిలి ఉంది. ఓవర్కు రెండు పరుగులు చేస్తే చాలు! తేలిగ్గా విజయం కోహ్లీ సేన వశం అయ్యేది. కానీ నిలబడిందెవరు? ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని కొనియాడుతున్న సారథి విరాట్ కోహ్లీ ఆడలేదు. ఓటమికి నయావాల్ ఛెతేశ్వర్ పుజారా గోడ కట్టలేదు. ఆశలు పెంచుకున్న ద్విశతకాల వీరుడు రోహిత్శర్మ ఆ దరిదాపులకే రాలేదు. యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు అదృష్టం కలిసిరాలేదు. అంతే..! విదేశాల్లో ఎదుర్కొన్న తొలి పరీక్షలోనే టీమిండియా విఫలమైంది! రెండో ఇన్నింగ్స్లో 135 పరుగులకే చతికిలపడింది. 72 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
ఉపసారథి అజింక్య రహానె ఉండాల్సిందేమో..
దక్షిణాఫ్రికా సహా విదేశాల్లో మెరుగైన రికార్డున్న ఉపసారథి అజింక్య రహానె తుది జట్టులో ఉంటే ఫలితం మారి ఉండేదేమో! బ్యాట్ను అటు అడ్డంగా.. ఇటు నిలువుగా ఆడగల దిట్ట అతడు. పేస్ పిచ్లపై పేసర్లను ఎలా అడ్డుకోవాలో టెక్నిక్ తెలిసిన తెలివైన వాడు. ఫిలాండర్.. మోర్కెల్.. రబాడాను అతను అడ్డుకొని ఉండేవాడేమో! గతి తప్పకుండా సరైన స్థానాల్లో విసిరిన చురకత్తుల్లాంటి బంతులు ఆపి నాలుగో బ్యాట్స్మన్గా వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఉండేవాడేమో! ఒక్క సిరీస్లో ఫామ్లో లేడని అతడిని తుది జట్టులోంచి తొలగించడం టీమిండియాకు నష్టమే చేసింది! అతడు లేని ప్రస్తుత వ్యూహం బెడిసికొట్టింది! ఒక్క మ్యాచ్లో ఓటమికే కోహ్లీసేన తప్పుపట్టలేం కానీ ఎంతో మందికి ఎన్నోసార్లు ఉదారంగా అవకాశాలిచ్చిన భారత్ రహానెను ఆడిస్తే ఎలాఉండేదో అన్నదే ప్రశ్న!
మూడో రోజంతా వర్షం పడ్డ తర్వాత కేప్టౌన్ పిచ్ విపరీతంగా
మూడో రోజంతా వర్షం పడ్డ తర్వాత కేప్టౌన్ పిచ్ విపరీతంగా మారిపోయింది. నాలుగో రోజు మొత్తం చేసిన పరుగులు 200లే. మూడోరోజు ఆట వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగో రోజు, సోమవారం దక్షిణాఫ్రికా 52/2 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. షమి (3/28), బుమ్రా (3/39), భువి (2/33) దెబ్బకు స్వల్ప పరుగుల తేడాతో ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది. డివిలియర్స్ (35; 50 బంతుల్లో 2×4, 2×6) ఒక్కడే కాస్త పోరాడాడు. అతడికి అండగా నిలిచే వారే కరవయ్యారు. 41.2 ఓవర్లకు 130 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ రోజు చేసింది 65 పరుగులే. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని టీమిండియాకు 208 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
ఊహించని రీతిలో ఫిలాండర్ ఎదురుదాడి:
ఛేదనకు దిగిన కోహ్లీసేనను దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్ (6/42) ఊహించని దెబ్బకొట్టాడు. మురళీ విజయ్ (13), విరాట్ కోహ్లీ (28; 40 బంతుల్లో 4×4), రోహిత్ శర్మ (10), రవిచంద్రన్ అశ్విన్ (37; 53 బంతుల్లో 5×4), మహ్మద్ షమి (4), బుమ్రా (0)ను వైవిధ్యమైన బంతులు విసిరి పెవిలియన్ పంపించాడు. అతడి ధాటికి 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు చేజార్చుకుంది. భువి సాయంతో అశ్విన్ కాసేపు పేసర్ల త్రయాన్ని ఎదుర్కొన్నాడు. 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కాసేపు ఆశలు కల్పించాడు. కానీ ఫిలాండర్ వాటిని అడియాసలు చేశాడు. 43వ ఓవర్లో మూడు వికెట్లు తీసి కథ ముగించాడు. అంతకు ముందు మోర్నీ మోర్కెల్ (2/39) శిఖర్ ధావన్ (16), పుజారా (4)ను ఔట్ చేశాడు. రబాడా ఏమో సాహా (8), పాండ్య (1) పని పట్టాడు.
రెండు ఇన్నింగ్స్ కలిపి ఇరు జట్ల స్కోరు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 286
భారత్ తొలి ఇన్నింగ్స్: 209
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 130
భారత్ రెండో ఇన్నింగ్స్: 135