
హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే తొలి మూడు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోని సంగతి తెలిసిందే.
అయితే జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా లార్డ్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఆడటం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రెండో టెస్టు మ్యాచ్కు బుమ్రా దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
నిజానికి తొలి టెస్టుకి దూరమైన బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, రెండో టెస్టు నాటికి అతడు కోలుకోకపోవడంతో బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు.
"జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు బౌలింగ్ చేయడానికి ఫిట్గానే ఉన్నాడు. కానీ అతన్ని అప్పుడే బరిలోకి దించలేం. అతడి చేయికి వేసిన ప్లాస్టర్ ముందు తొలగిపోవాలి. రెండో టెస్టుకు అతడు సెలక్షన్కు అందుబాటులో లేడు" అని మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్కు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో సాధన చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్పై జట్టు ప్రత్యేక దృష్టి సారించింది.
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.