భారత్ గడ్డపై తొలిసారి:
2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 17 టెస్టుల్లో 79 వికెట్లు పడగొట్టాడు. అవన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. బుమ్రా శుక్రవారం చెన్నైలోనే భారత్ గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. బుమ్రా 2016లోనే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి సత్తాచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ సమయంలో స్టార్ పేసర్గా ఎదిగిన బుమ్రా ఇంగ్లండ్పై ఎలా పోరాడతాడో? అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
21 సగటుతో 79 వికెట్లు:
జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుకెక్కాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్ చూపిన బుమ్రా.. టెస్టులో తన ముద్రను ఎలా వేయనున్నాడనేది తేలిపోనుంది. బుమ్రా భారత్ తరఫున 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.
|
హాట్ ఫేవరెట్గా భారత్:
సుదీర్ఘ పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలను భారత్ గడ్డపై ఇంగ్లండ్ ఆడనుంది. ఓవరాల్గా రికార్డులపరంగా చూసుకుంటే ఈరోజు మ్యాచ్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ టీమ్ పూర్తి స్థాయిలో సిరీస్ కోసం భారత్కి రాగా.. అప్పట్లో ఐదు టెస్టుల సిరీస్ని టీమిండియా 4-0తో గెలిచింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తర్వాత భారత్లో ఈరోజే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ప్రారంభంకాబోతున్నాయి.