అదనపు బౌలర్ ఉంటే విశ్రాంతి దొరుకుతుంది
"అదనపు బౌలర్ ఉంటే కేవలం విశ్రాంతి దొరుకుతుంది. లేదంటే త్వరగా, ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నాకు కనిపించిన వ్యత్యాసం అదే. మేం చాలా అత్యుత్తమంగా బౌలింగ్ చేశాం. చాలా ఓవర్లు విసిరాం. ఇంగ్లాండ్ 190/7 ఉన్నప్పుడు మేం మంచి స్థాయిలో ఉన్నాం. కానీ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు" అని బుమ్రా అన్నాడు.
అవకాశాలను మేం అందిపుచ్చుకోలేదు
"అవకాశాలను మేం అందిపుచ్చుకోలేదు. పిచ్పై సరైన ప్రాంతాల్లో బంతులు విసిరేందుకు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ బాగా ఆడారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం ప్రత్యేక ప్రణాళిక ఏమీ లేదు. జోస్ బట్లర్ బాగా ఆడాడు. అతడిని త్వరగా ఔట్ చేసుంటే పరిస్థితి మరోలా ఉంటుందా లేదా చెప్పలేం" అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
లోయర్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా, దూకుడుగా ఆడతారు
"సాధారణంగా లోయర్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా, దూకుడుగా ఆడతారు. వస్తే పరుగులొస్తాయి. లేదంటే పోయేదేమీ ఉండదు అన్నట్లు ఆడతారు" అని బుమ్రా అన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్లో హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే
దీంతో ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని తగ్గించగలిగారు. ఈ క్రమంలో మూడో రోజైన ఆదివారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది