పంత్ తొందరపాటు:
రెండో టీ20లో టీమిండియా అన్ని విభాగాల్లో సత్తాచాటగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయంలో మాత్రం ఇంకా ఆందోళనగానే ఉంది. బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయిన పంత్.. అటు కీపింగ్లో కూడా మెప్పించలేకపోతున్నాడు. తొలి టీ20లో డీఆర్ఎస్ విషయంలో రోహిత్ శర్మను బోల్తా కొట్టించగా.. రెండో టీ20లో అత్యుత్సాహం ప్రదర్శించి బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ను స్టంపౌట్ నుంచి కాపాడాడు. తన తొందరపాటు వల్ల అభిమానులతో పాటు జట్టు సభ్యులను కలవర పెట్టాడు.
|
ఔట్.. కానీ నాటౌట్:
ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వేసిన మూడో బంతిని లిటన్ దాస్ క్రీజు వదిలి ముందుకువచ్చి ఆడాలని ప్రయత్నించాడు. పంత్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో లిటన్ పెవిలియన్ బాటపట్టాడు. అయితే ఆ బంతిని చెక్ చేసిన థర్డ్అంపైర్.. నాటౌట్గా ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఐసీసీ 40.3 నిబంధన ప్రకారం నాటౌట్:
ఐసీసీ 40.3 నిబంధన ప్రకారం.. బ్యాట్స్మన్ శరీరం లేదా బ్యాట్కు తాకని బంతి వికెట్లను దాటి వచ్చిన తర్వాతే కీపర్ అందుకుని స్టంప్ చేయాలి. కీపర్ గ్లౌజ్లోని ఏ భాగమైనా వికెట్కంటే ముందు ఉంటే.. అది నోబాల్ కిందే లెక్క. ఇక్కడ బంతిని పంత్ వికెట్లకు కాస్త ముందుగానే అందుకుని స్టంప్ చేశాడు. అది నోబాల్ అవ్వడంతో థర్డ్అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు.
మండిపడుతున్న అభిమానులు:
ప్రస్తుతం పంత్పై అభిమానులు మండిపడుతున్నారు. ఐసీసీ నిబంధనలపై పంత్కు కనీస అవగాహన లేకపోతే ఎలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పంత్.. ఎంఎస్ ధోనీని అనుకరించడానికి ప్రయత్నించొద్దు అని ఈ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కీపర్ గిల్క్రిస్ట్ సూచించాడు. ధోనీలా చేసేందుకు చూస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని హెచ్చరించిన విషయం తెలిసిందే.
టీమిండియా విజయం:
గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్ (31 బంతుల్లో 5 ఫోర్లతో 36) టాప్ స్కోరర్. చాహల్కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 31) ఫర్వాలేదనిపించాడు. అమినుల్కు రెండు వికెట్లు దక్కాయి. రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. చివరి మ్యాచ్ ఆదివారం నాగ్పూర్లో జరుగుతుంది.