
హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన ఓపెనర్ రోహిత్ శర్మను చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ ఇంటర్యూ చేశాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దాదాపు 13 బంతుల వరకు ఖాతా తెరవలేదు. ఆ తర్వాత విజృంభించిన 129 బంతుల్లో 133 పరుగులతో సెంచరీ సాధించాడు.
వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 22వ సెంచరీ. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మూడు సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు. 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు.
ధోనీతో కలిసి నాలుగో వికెట్కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. అయితే, జట్టులోని మిగతా సహచరుల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం రోహిత్ను చాహల్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
యజువేంద్ర చాహల్: ఓపెనర్గా ఆటమొదలు పెట్టిన మీరు అద్భుతమైన సెంచరీ ఎలా చేయగలిగారు?
రోహిత్ శర్మ (నవ్వుతూ): మేం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు కొత్త బంతిని సమర్ధంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఆసీస్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు
యజువేంద్ర చాహల్: 4/3 స్కోరు వద్ద మీతో ధోనీ కలిసినప్పుడు మీరేం ప్లాన్ చేసుకున్నారు?
రోహిత్ శర్మ: ధోనీ క్రీజులోకి రాగానే మేం ఇద్దరం మంచి భాగస్వామ్యాన్ని అందివ్వాలనుకున్నాం. దాని ప్రకారమే ఎక్కువ భాగస్వామ్య పరుగులు చేశాం
యజువేంద్ర చాహల్: మీరు, ధావన్ మంచి ప్లాన్తో మైదానంలోకి వచ్చినట్లున్నారు
రోహిత్ శర్మ: అనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. కొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు బలంగా ఉంటుంది. ఏదేమైనా ఇది మాకు మంచి అనుభవం. అలాంటి పరిస్థితుల్లో ఏలా మెలగాలో తెలిసొచ్చింది.