కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటిమిపాలై భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ను 2-0తో కోల్పోయింది. ఇక నామమాత్రమైన ఆఖరి వన్డే బుధవారం ఉదయం 9:10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వన్డే ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. బుధవారం జరగబోయే మూడో వన్డేలో విరాట్ 23 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా నిలుస్తాడు.
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఒకవేళ కాన్బెర్రాలో జరిగే మూడో వన్డేలోనే విరాట్ 23 పరుగులు చేస్తే.. తన 251వ వన్డే, 242వ ఇన్నింగ్స్లోనే 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే సచిన్ ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్లు, 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఆ లెక్కన మాస్టర్ బ్లాస్టర్ కంటే ఎంతో ముందుగానే విరాట్ ఈ మార్క్ను అందుకోనున్నాడు. ఇద్దరి మధ్య 50కిపైగా వన్డేలు తేడాలు ఉన్నాయి. కోహ్లీ ఒకటి లేదా రెండు వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వాళ్లలో విరాట్ కోహ్లీ ఆరో ప్లేయర్గా నిలవనున్నాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్తో పాటు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక), సనత్ జయసూర్య (శ్రీలంక), మహేల జయవర్దనె (శ్రీలంక) కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. 12 వేల పరుగులకు పైగా చేసిన వాళ్లలో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు ఉండడం విశేషం.
విరాట్ కోహ్లీ మూడో వన్డేలో సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్మన్గా సచిన్ టెండూల్కర్ (9 సెంచరీలు) సరసన నిలుస్తాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 22 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్గా విరాట్ నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్లో ఉన్న టెండూల్కర్ను విరాట్ వెనక్కు నెట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకోగా.. సచిన్ 493 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. బ్రియాన్ లారా (511 ఇన్నింగ్స్లు), రిక్కీ పాంటింగ్ (514) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
టీమిండియా అసలు సమస్య అదే.. అందుకే ఈ ఓటములు: ఆకాశ్ చోప్రా