దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో
ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ స్థితి నుంచి ఆతిథ్య జట్టుని 286 పరుగులు చేసేలా మన బౌలర్లు బంతులు వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా పాండ్యా (93) రాణించడంతో 209 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు గొప్పగా రాణించి దక్షిణాఫ్రికాను 130కే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ ముందు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఉంచింది. ఒకానొక దశలో టీమిండియా స్కోరు 71/3గా ఉంది. ఎప్పుడైతే కోహ్లీ (28) ఔటయ్యాడో ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 135 పరుగులకే ఆలౌట్. ఈ సిరీస్లో భారత్ 1-2తో ఓటమిపాలైంది.
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 287 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ (149) రాణించడంతో 274 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 86/6తో నిలిచింది. ఆ దశలో బౌలర్లు ఒత్తిడి కొనసాగించి ఉంటే.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం ఉండేది. అయితే యువ ఆటగాడు శామ్ కరన్ (63)ను ఆపలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ 180 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ ముందు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లీ (51) ఉన్నంతసేపూ భారత్ గెలిచేలాగే కనిపించింది. 141 పరుగుల వద్ద ఆరో వికెట్ రూపంలో కోహ్లీ ఔట్ కాగానే, 162 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరిస్ ఫలితం మరోలా ఉండేది.
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు
ఇక, 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు అప్పటి కెప్టెన్ ధోని దూరమవగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 517/7తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ బ్యాట్స్ మెన్లలో కోహ్లీ(115) రాణించడంతో భారత్ 444 పరుగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు భారత్కు 364 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ (141) సెంచరీతో చెలరేగడంతో టీమిండియా రేసులోకి వచ్చింది. ఎప్ఫుడైతే కోహ్లీ ఔటయ్యాడో ఆ తర్వాత భారత్ 315 వద్ద ఇన్నింగ్స్ను ముగిసింది. ఇలా టెస్టుల్లో భారత పరాజయాల్లో లోయర్ ఆర్డర్ పాత్ర కీలకం.
ఆస్ట్రేలియా ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో
ఇక, ప్రస్తుతం ఆసీస్ గడ్డపై తొలి టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో బౌలర్లు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను ఔట్ చేయలేకపోవడంతో భారీ స్కోరు చేయనిచ్చారు. ఆ జట్టు చివరి నలుగురు బ్యాట్స్మన్ కలిసి 203 పరుగులు చేశారు. దీంతో భారత బౌలర్లు అసలైన టెస్టు సిరిస్లో ఈ బలహీనతను వీడతారో లేక భారీగా పరుగులు సమర్పించుకుంటారో తెలియాల్సి ఉంది.