
సిడ్నీ: కరోనా మహమ్మారి వల్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే సిరీస్కు ఆడుతుండటం అభిమానులను భూమ్మీద నిలవనివ్వట్లేదు. వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ప్రత్యక్షంగా మ్యాచ్ను చూడలేకపోతోన్న టీమిండియా ఫ్యాన్స్.. స్టేడియం వద్దే మకాం వేశారు. డ్రమ్ బీట్స్తో హోరెత్తిస్తున్నారు. అమ్మోరి జాతరను తలపించేలా స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇదివరకట్లా స్టేడియంలోకి వేల సంఖ్యలో అభిమానులను అనుమతించట్లేదు. భౌతిక దూరాన్ని పాటించడానికి వీలుగా.. పరిమితంగా మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. టికెట్లు దొరకని అభిమానులు నిరాశకు గురి కావట్లేదు. వారు కూడా సిడ్నీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్ను చూడలేకపోతోన్న కొరతను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా జెర్సీలను ధరించి ఆటపాటలతో సందడి చేశారు.
290 రోజుల తరువాత టీమిండియా ఆడుతోన్న తొలి మ్యాచ్ ఇది. చివరిసారిగా ధర్మశాలలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చివరి మ్యాచ్ ఆడింది. ఇన్ని రోజుల సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండటానికి సంబంధించిన ఆనందం.. అభిమానుల్లో క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఏ రకంగా స్టేడియంలో కేరింతలు కొడతారో.. అదే తరహాలో స్టేడియం బయట కోలాహలం నెలకొంది.
డ్రమ్స్, బూరెలు, ప్లకార్డులను అభిమానులు తమ వెంట తెచ్చుకున్నారు. హోటల్ నుంచి స్టేడియానికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు దూరం నుంచే విష్ చేయడం కనిపించింది. ఉద్విగ్న క్షణాలను అభిమానులు దాచుకోలేకపోతున్నారు. ఇదివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు కొనసాగినప్పటికీ.. ఇంటర్నేషనల్ వన్డేలకు ఉన్న మజాయే వేరు. వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడిన ప్లేయర్లు.. భారత్ తరఫున బరిలోకి దిగారు.