హైదరాబాద్: సిడ్నీ వన్డేలో ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడమే మా ఓటమికి కారణమైందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
India Vs Australia, 1st ODI: రోహిత్ సెంచరీ వృధా, సిడ్నీలో భారత్ ఓటమి
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఈ ఆటను మేం సమర్థించుకోం. ఈ మ్యాచ్లో బంతితో బాగానే రాణించామని అనుకుంటున్నా. ఎందుకంటే 300పైగా పరుగులు వచ్చే ఈ పిచ్లో ప్రత్యర్థిని 288కే పరిమితం చేశాం. కానీ ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం ఎప్పటికీ మంచిది కాదు" అని అన్నాడు.
"రోహిత్ అద్భుతమైన ఆటకు ధోని మద్దతివ్వడంతో మాకు విజయావకాశాలపై ఆశలు చిగురించాయి. కానీ ధోని ఔట్ అవ్వడంతో రోహిత్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రోహిత్కు అండగా మరో మంచి భాగస్వామ్యం నమోదైతే విజయం సాధించేవాళ్లం. కానీ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది" అని కోహ్లీ చెప్పాడు.
"ఆతిథ్య జట్టు మా కంటే బాగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఫలితంతో మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. ఇలాంటి ఫలితాలు జట్టుగా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి" కోహ్లీ అన్నాడు. ఆసీస్ నిర్దేశించి 291 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేసింది.
4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. ధోనీతో కలిసి నాలుగో వికెట్కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. ఓ ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ... ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించాడు.
వరుసగా పదో సిరీస్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ(133;129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వన్డేల్లో 22వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో రోహిత్ శర్మ ఏడో వికెట్గా ఔటయ్యాడు. రోహిత్కు తోడాగు ధోని(51; 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీయగా, మార్కస్ స్టోనియిస్, బెహ్రండార్ఫ్ చెరో రెండు... పీటర్ సిడ్డిల్ ఒక వికెట్ తీశాడు.