హైదరాబాద్: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని (79: 88 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో తన అంతర్జాతీయ కెరీర్లో ధోని వందో హాఫ్ సెంచరీని పూర్తి నమోదు చేశాడు. టెస్టుల్లో 66 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో ధోని ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇలా వందో హాఫ్ సెంచరీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 164 హాఫ్ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్ధానాల్లో రాహుల్ ద్రవిడ్(146), సౌరవ్ గంగూలీలు(107) ఉండగా... వీరి తర్వాత ధోని నాలుగో స్థానంలో నిలిచాడు. మరో ఎనిమిది హాఫ్ సెంచరీలు బాదితే గంగూలీని ధోనీ అధిగమిస్తాడు. అంతేకాదు మొత్తంగా ప్రపంచంలోనే ఈ 100 హాఫ్ సెంచరీలు సాధించిన 13వ బ్యాట్స్మెన్గా ధోని అరుదైన ఘనత సాధించాడు.
వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 9,737 పరుగులు చేసిన ధోని పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ఇంకా 263 పరుగులు చేయాల్సి ఉంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత స్వదేశంలో 4000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా ధోని చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. కాగా, అంతర్జాతీయ కెరీర్లో వందో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.