ధోని స్థానంలో రిషబ్ పంత్
ధోని స్థానంలో రిషబ్ పంత్ చివరి రెండు వన్డేల్లో ఆడనున్నాడు. అలాగే గాయపడిన పేసర్ మహ్మద్ షమి కూడా చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. "ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు మ్యాచ్ల్లో మార్పులు చేయాలనుకున్నాం. దీంట్లో భాగంగా ధోనీకి విశ్రాంతినిచ్చాం. పంత్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు" అని అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు.
కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తోన్న బీసీసీఐ
వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. పనిభారం వల్ల ఒత్తిడి లేకుండా చూడటం కోసం ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లీ బోర్డుకు గతంలో సూచించాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినిచ్చినట్లు సంజయ్ బంగర్ వెల్లడించాడు. రాంచీ వన్డేలో ధోని 26 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
టాప్ స్కోరర్గా నిలిచిన ధోని
గత ఏడాది 20 మ్యాచ్ల్లో 275 పరుగులు మాత్రమే చేసిన ధోనీ.. 2019ని మాత్రం ఘనంగా ఆరంభించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి ఆస్ట్రేలియా గడ్డ భారత్ తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని సైతం కైవసం చేసుకున్నాడు.
సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడిన ధోని?
ఆ తర్వాత కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అయితే, ఈ పర్యటనలో ధోనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ భారత గడ్డపై ధోని చివరి వన్డే అయ్యే అవకాశం ఉంది. దీంతో భారత గడ్డపై ధోనీ తన చివరి మ్యాచ్ను ఆడేశాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్ వరకు సొంతగడ్డపై భారత్కు ఎలాంటి మ్యాచ్లు లేకపోవడంతో ధోని సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడని అంటున్నారు.