తొలి టీ20: చివరి వరకు ఉత్కంఠ, 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి


హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ 4 పరుగులు తేడాతో ఓడిపోయింది. డక్వర్త్ లాయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
దీంతో తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్లో రెండో టీ20 శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
ఆసీస్ కంటే ఎక్కువ స్కోరు చేసినా భారత్ ఓటమి
సాంకేతిక అంశాలను పక్కడపెడితే 17 ఓవర్లలో ఆస్ట్రేలియా కంటే భారత్ ఎక్కువ స్కోరే చేయడం విశేషం. 17ఓవర్లకు ఆస్ట్రేలియా 158 పరుగులు చేస్తే, టీమిండియా 169 పరుగులు చేసింది. అయితే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్కు లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితం ఎలావున్నా ఇరు జట్లకు చెందిన క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆటను ఆస్వాదించారు.
చివరి ఓవర్లో 13 పరుగులు
ఈ మ్యాచ్లో భారత్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన సమయంలో కృనాల్ పాండ్యా(2), దినేష్ కార్తీక్(30) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడం భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. అంతకముందు రిషబ్ పంత్(20) పరుగులు చేయగా.. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (4) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.
చెరో రెండు వికెట్లు తీసిన జంపా, స్టోయినిస్
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 174 పరుగులుగా సవరించారు.
24 బంతుల్లో 46 పరుగులు చేసిన మ్యాక్స్వెల్
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో మ్యాక్స్వెల్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా బౌలింగ్లో మ్యాక్స్వెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్లో మొత్తం నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మార్కస్ స్టోయినిస్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, క్రిస్ లిన్, (37), ఆరోన్ ఫించ్ (27) పరుగులతో రాణించారు. ఆరు టీ20ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ మ్యాచ్లో రెండెంకల స్కోరు చేయడం విశేషం.
తొలి వికెట్ తీసిన ఖలీల్ అహ్మద్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇవ్వలేదు. ఓపెనర్ డార్షీ షార్ట్ (7)ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్కు చేర్చగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ లిన్తో కలిసి మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతోన్న సమయంలో తొలుత ఫించ్ను, తర్వాత లిన్ను కుల్దీప్ పెవిలియన్కు పంపాడు.
16.1 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డంకి
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్, మ్యాక్స్వెల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ వికెట్ పడకుండా ఆడుతూనే భారీ షాట్లతో అలరించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు హాఫ్ సెంచరీకి పైగా పరుగులు నమోదు చేశారు. ఈ క్రమంలో 16.1 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డంకిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.

మ్యాచ్ని 17 ఓవర్లకు కుదించిన అంఫైర్లు
గంట తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైన వెంటనే మ్యాక్స్వెల్(46)ను బుమ్రా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా తన 4 ఓవర్ల వేసి 55 పరుగులు ఇవ్వగా.. ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు.

రెండు క్యాచ్లు జారవిడిచిన భారత ఫీల్డర్లు
కుల్దీప్ యాదవ్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. బూమ్రాకు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడచడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications