ధోనీ స్థానంలో పంత్:
ప్రపంచకప్ అనంతరం ధోనీపై అనేక విమర్శలతో పాటు రిటైర్మెంట్పై తెగ వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ధోనీ తీసుకున్న నిర్ణయంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం అయితే రిటైర్మెంట్ తీసుకోవట్లేదు, రెండు నెలలు భారత ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నా అని ధోనీ స్పష్టం చేసాడు. దీంతో విండీస్ పర్యటనకు ధోనీ స్థానంలో రిషబ్ పంత్ను ఎంపిక చేశారు.
కొత్తేమీ కాదు:
విండీస్ పర్యటనకు ఎంపికవడంపై రిషబ్ పంత్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడుతా. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం కొత్తేమీ కాదు. ఐపీఎల్ వంటి టోర్నీలో ఆడాను. ఆట ఆడటానికి ప్రత్యేకమైన శైలిని అనుకరించను. ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా ఆడతా. ప్రజలు ఏం అనుకుంటారో నాకు తెలియదు, ఎందుకంటే నేను వార్తా పత్రికలను ఎక్కువగా చదవను' అని పంత్ తెలిపారు.
ప్రతిరోజూ నేర్చుకోవాల్సిందే:
'ఫార్మాట్ల గురించి ఎక్కువగా ఆలోచించను. మొదట టెస్ట్ క్రికెట్ ఆడటం ఉపయోగపడింది. టెస్ట్ క్రికెట్ ఆడటంతో మంచి అనుభవం వచ్చింది. టెస్ట్ క్రికెట్ చాలా కష్టమని అందరూ చెప్పేవారు, దీంతో నేను చాలా కష్టపడ్డా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో, టేయిలెండర్లతో ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్చుకున్నా. టెస్ట్ క్రికెట్లో ప్రతిరోజూ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వన్డే, టి20లలో నేర్చుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది' అని పంత్ పేర్కొన్నాడు.
ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా:
'ధోనీ స్థానంలో ఆడటం అంత సులువు కాదు. అది పెద్ద బాధ్యత. దాని గురించి ఆలోచిస్తే సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం నేను ఏం చెయ్యాలనే విషయంపైనే ఆలోచిస్తున్నా. దేశం కోసం అత్యుత్తమంగా ఆడాలని అనుకుంటున్నా. అదొక్క విషయంపైనే నేను దృష్టిసారించా. ప్రతి సంవత్సరం నీ ఆటకు ఏదైనా జోడించాలి అని నా కోచ్ ఎల్లప్పుడూ చెపుతుండేవాడు. టెక్నాలజీ ఉపయోగించుకుని ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా' అని పంత్ చెప్పుకొచ్చారు.