హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది. ఇక, సోమవారం నుంచి సపోర్టింగ్ స్టాఫ్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కోచ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సపోర్టింగ్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
కలలో కూడా ఊహించలేదు: 11 ఏళ్ల క్రికెట్ కెరీర్పై కోహ్లీ భావోద్వేగ ట్వీట్
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తమ ఎంపికలపై ధీమాతో ఉండగా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంపిక మాత్రం కష్టమేనని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపడంపై బ్యాటింగ్ కోచ్ పాత్ర ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో బ్యాటింగ్ కోచ్గా సంజయ్ బంగర్ను తప్పించాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాటింగ్ కోచ్ పదవి రేసులో సంజయ్ బంగర్కు విక్రమ్ రాథోర్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు. విక్రమ్ రాథోర్ 1990ల్లో టీమిండియా తరఫున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడిన అనుభవం ఉంది. దీనికి తోడు అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతు కూడా ఉండటం కలిసొచ్చే అంశం.
భారత్ నుంచి విక్రమ్రాథోర్తో పాటు రాబిన్ సింగ్, మిథున్ మన్హాస్, ప్రవీణ్ ఆమ్రే, అమోల్ ముజుమ్దార్, హృషికేశ్ కనిక్తర్, లాల్చంద్ రాజ్పుత్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక, విదేశీయుల్లో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ జొనాథన్ ట్రాట్, మార్క్ రాంప్రకాశ్లు బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.
సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు
ఇక, బౌలింగ్ కోచ్ విషయానికి వస్తే భరత్ అరుణ్ ఎంపిక లాంఛనమే అంటున్నారు. అయితే, మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్. మాజీ స్పిన్నర్ సునీల్ జోషి కూడా రేసులో ఉన్నారు. ఫీల్డింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మూడు పదవులకు ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఇంటర్వ్యూల ప్రక్రియ మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
మరోవైపు ఇటీవలే హెడ్ కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి 2021 టీ20 ప్రపంచకప్ వరకూ కొనసాగనున్నాడు. ఇప్పటివరకు అతడికి సపోర్ట్గా నిలిచిన సిబ్బందినే(భరత్ అరుణ్, సంజయ్ బంగర్, ఆర్.శ్రీధర్)లకే మరోమారు అవకాశం కల్పిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్ల వాదన.